
కలకలం
పుట్టపర్తి అర్బన్ : భార్యను అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి చంపి, రైలు కింద పడి తనూ ఆత్మహత్య చేసుకున్న ఆర్ఎంపీ వైద్యుడి ఘటన బుధవారం పుట్టపర్తిలో కలకలం రేపింది.
పుట్టపర్తి అర్బన్ :
భార్యను అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి చంపి, రైలు కింద పడి తనూ ఆత్మహత్య చేసుకున్న ఆర్ఎంపీ వైద్యుడి ఘటన బుధవారం పుట్టపర్తిలో కలకలం రేపింది. పుట్టపర్తి ప్రశాంతి గ్రామంలోని ధర్మశాల సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పుట్టపర్తి అర్బన్ సీఐ వేణుగోపాల్, బంధువులు, గ్రామస్తుల కథనం మేరకు వివరాలు.. నల్లమాడ మండలం కొత్తపల్లి తండా వాసి, ఆర్ఎంపీ వైద్యుడు మురళీధర్ నాయక్(30)తో, కదిరి సమీపంలోని పట్నం రాచువారిపల్లికి చెందిన నీలాబాయి(28)కి 2007లో వివాహమైంది. అనంతరం ప్రశాంతి గ్రామంలో కాపురం పెట్టారు. వీరికి కుమారుడు మోక్షిత్(5) కుమార్తె లాస్య(2) ఉన్నారు. ధర్మశాల దగ్గర్లోని బీడుపల్లి గ్రామంలో క్లీనిక్ నిర్వహిస్తున్నాడు. ఐదు నెలల క్రితం ధర్మశాల వద్దకు మకాం మార్చాడు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం యథావిధిగా క్లీనిక్కు వెళ్లాడు. కుమారుడు మోక్షిత్ ఇంటి సమీపంలోని ఇంగ్లిష్ మీడియం స్కూలుకు వెళ్లాడు. 11 గంటలకు ఇంటికి వచ్చిన మురళీధర్ నాయక్, వచ్చీ రాగానే భార్యను పిడిబాకుతో మెడ, చేతులు, పొట్టలో, పలుచోట్ల కసిదీరా పొడిచాడు. ఆమె అరుపులు బయటికి వినిపించకుండా టీవీ వాల్యూమ్ బాగా పెంచాడు. ఇంట్లో ఆడుకుంటున్న కూతురు లాస్యనూ చంపేందుకు కడుపులో పొడిచాడు. భర్త బారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఇంట్లోని మూడు గదులూ రక్తసిక్తమయ్యాయి. కూతురు కూడా చని పోయిందని భావించి వదిలేశాడు. అనంతరం తనూ బెడ్ రూంలోని ఫ్యాన్ కొక్కేనికి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. కానీ మనసు మార్చుకుని రక్తపు మరకలున్న దుస్తుల్ని విప్పేసి వేరే దుస్తులు ధరించి, టీవీ కట్టేసి, ఏమీ ఎరుగనట్లు ఇంటికి తాళం వేసి క్లీనిక్కు వెళ్లాడు. అక్కడ తలుపులు తెరవకుండా కొద్దిసేపు అటూఇటూ తిరిగి.. ద్విచక్ర వాహనంలో ప్రశాంతి రైల్వే స్టేషన్(పుట్టపర్తి రైల్వే స్టేషన్)కు చేరుకుని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో అతని తల, మొండెం వేరయ్యాయి.
కాగా హత్యానంతరం ఇంట్లోనే వదిలి వెళ్లిన పిడిబాకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పిల్లలకు మధ్యాహ్న భోజనం తీసుకెళ్లే క్రమంలో తోటి మహిళలు నీలాబాయి రాకపోవడంతో ఇంటి వద్దకు వెళ్లారు. ఇంట్లోంచి పాప ఏడుపు వినిపించడంతో తలుపు వద్దకు వెళ్లి ఎంత పిలిచినా పలకలేదు. అనుమానంతో వారు ఇంటి వెనుక వైపున ఉన్న కిటీకి అద్దం పగులగొట్టి లోపలకు తొంగి చూశారు. రక్తపు మడుగులో విగత జీవిగా పడి ఉన్న నీలాబాయిని చూసి నిశ్చేష్టులయ్యారు. వీరి సమాచారంతో పుట్టపర్తి అర్బన్ ఎస్సై ప్రవీణ్కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని తలుపులు పగుల గొట్టారు. పొట్టలోంచి పేగులు బయటపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారి లాస్యను 108 వాహనంలో సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం అనంతపురంలోని చిన్నారి ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ హరిప్రసాద్ చిన్నారికి చికిత్స చేశారు. పరిస్థితి విషమంగానే ఉన్నట్లు ఆయన తెలిపారు. కాగా ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు, బంధువులు తెలిపారు. డీఎస్పీ శ్రీనివాసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనతో పిల్లలిద్దరూ అనాథలయ్యారు. కేసు దర్యాప్తులో ఉంది.