
ఆయకట్టు ఎడారే! రబీ సాగు ప్రశ్నార్థకం!
జిల్లాలోని జలాశయాల్లో నీరు పుష్కలంగా ఉన్నా ఆయకట్టు రైతులకు నిరాశే ఎదురవుతోంది. రబీలోనైనా పంటలు విస్తారంగా పండించి ఖరీఫ్ నష్టం నుంచి కోలుకోవాలన్న వారి ఆశలను నీటిపారుదల జిల్లా సలహాసంఘం(ఐఏబీ) ఆవిరిచేసింది.
సంగారెడ్డి డివిజన్, న్యూస్లైన్:
జిల్లాలోని జలాశయాల్లో నీరు పుష్కలంగా ఉన్నా ఆయకట్టు రైతులకు నిరాశే ఎదురవుతోంది. రబీలోనైనా పంటలు విస్తారంగా పండించి ఖరీఫ్ నష్టం నుంచి కోలుకోవాలన్న వారి ఆశలను నీటిపారుదల జిల్లా సలహాసంఘం(ఐఏబీ) ఆవిరిచేసింది. వివిధ ప్రాజెక్టుల నుంచి అరకొర నీటి కేటాయింపులే ఇందుకు కారణం.
సింగూరు, నల్లవాగు సహా జిల్లాలోని చిన్ననీటి ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయి. దీంతో రబీలో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందుతుందని రైతులు ఆశించారు. కలెక్టర్ అధ్యక్షతన జరిగిన నీటిపారుదల జిల్లా సలహాసంఘం రబీలో ఘనపూర్ ఆయకట్టు కింద పదివేల ఎకరాలు, నల్లవాగు ఆయకట్టు కింద ఐదువేల ఎకరాలకు, చిన్ననీటిపారుదల చెరువుల కింద మరోమూడువేల ఎకరాలకు నీటిని కేటాయించేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే ఐఏబీ నిర్ణయంపై రైతు సంఘాలు కన్నెర్ర చేస్తున్నాయి. సింగూరు, నల్లవాగులో జలాలు సమృద్ధిగా ఉన్నందునా నీటి కేటాయింపులు పెంచి రబీలో ఆయకట్టు మరింత పెరిగేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని రైతులు చెబుతున్నారు. ఐఏబీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కిష్టారెడ్డి సైతం నల్లవాగు ఆయకట్టు కింద సాగునీరు కేటాయింపుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. మొదట నల్లవాగు ఆయకట్టు కింద కేవలం నాలుగువేల ఎకరాలకే రబీలో సాగునీరు కేటాయించాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. దీనికి ఎమ్మెల్యే అంగీకరించకపోవడంతో ఐదు వేల ఎకరాలకునీటి కేటాయింపునకు కలెక్టర్ అంగీకరించినట్లు సమాచారం. వీటిలో 160 ఎకరాల మెట్ట, మిగతా ఆరుతడిపంటలకు నాలుగు విడతల్లో 746 ఎ ంసీఎఫ్టీ జలాలు కేటాయించాలని నిర్ణయించి నట్లు తెలిసింది.
15వేల ఎకరాలకు డిమాండ్
సింగూరు ప్రాజెక్టు దిగువ భాగంలో ఘనపురం మధ్య తరహా ప్రాజెక్టు ఉంది. సింగూరులో ప్రస్తుతం 523 అడుగుల మేర నీరు ఉన్నందున ఆయకట్టు రైతులు రబీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఘనపురం ఆయకట్టు మొత్తం 21,065 ఎకరాలు ఉంది. ఖరీఫ్లో వర్షాలు బాగా కురవడంతో ఆయకట్టు రైతాంగం ప్రాజెక్టు నుంచి చుక్కనీరు వాడుకోలేదు. దీంతో రబీలో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందుతాయని రైతులు ఆశించారు. సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపురం ఆయకట్టు కింద ఏడాదిలో 4 టీఎంసీల వాటా ఉండగా, నిజాంసాగర్కు 8 టీఎంసీల వాటా ఉంది. ప్రస్తుతం నిజాంసాగర్ నిండుకుండలా ఉంది. రబీలో వారు సాగునీటి వాటా అడిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. దీంతో ఘనపురం ప్రాజెక్టు కింద 15వేల ఎకరాలకుపైగా ఆయకట్టు సాగు చేసుకునేందుకు ఏడు విడతల్లో 2.5 టీఎంసీలకుపైగా జలాలు కేటాయించాలని రైతులు కోరుతున్నారు. అయితే ఐఏబీ మాత్రం కేవలం పదివేల ఎకరాలకు ఏడు విడతల్లో 1.95 టీఎంసీల సాగునీరు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఐఏబీ నిర్ణయంపై రైతు సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఐఏబీ నిర్ణయం చేసినా ఇంకా ప్రభుత్వం జీవో జారీ చేయనుందన జిల్లా యంత్రాంగం ఘనపురం ఆయకట్టుకు నీటి కేటాయింపులు పెంచే అవకాశాన్ని పరిశీలించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
చెరువుల కింద కేటాయింపులు తక్కువే
చిన్ననీటి పారుదల చెరువల కింద రబీ నీటి కేటాయింపులు తక్కువగానే ఉన్నాయి. జిల్లాలో మొత్తం 27 చిన్ననీటి తరహా చెరువులు ఉండగా వీటిలో కేవలం 19 చెరువుల కింద మాత్రమే మూడువేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందజేయాలని ఐఏబీ నిర్ణయం తీసుకుంది. సంగారెడ్డి డివిజన్లోని 11 చెరువుల పరిధిలో 1,355, మెదక్ డివిజన్ పరిధిలోని ఏడు చెరువుల కింద 2,234 ఎకరాలు, సిద్దిపేట డివిజన్లో ఒకచెరువు కింద 250 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందజేయాలని నిర్ణయించింది.
ఘనపురం ఆయకట్టు కింద నీటి కేటాయింపులు
2010-11 1853.15 ఎంసీఎఫ్టీ
2011-12 1449.32 ఎంసీఎఫ్టీ
2012-13(మార్చిలో) 500.34 ఎంసీఎఫ్టీ
-నల్లవాగు ప్రాజెక్టు కింద గత ఏడాది కేవలం 732
ఎంసీఎఫ్టీ నీళ్లు ఆయకట్టుకు కేటాయించారు.