ఏదీ ప్రోత్సాహం..? | No encouragement ..? | Sakshi
Sakshi News home page

ఏదీ ప్రోత్సాహం..?

Aug 4 2014 2:34 AM | Updated on Sep 2 2017 11:19 AM

గ్రామ స్వరాజ్యంతోనే దేశ అభివృద్ధి సాధ్యపడుతుందని జాతిపిత ఆశయాలకు నేటి పాలకులు తుంగలోకి తొక్కుతున్నారు. పంచాయతీల అభివృద్ధిపై చిన్న చూపు చూస్తున్నారు.

విజయనగరం మున్సిపాలిటీ: గ్రామ స్వరాజ్యంతోనే దేశ అభివృద్ధి సాధ్యపడుతుందని జాతిపిత ఆశయాలకు నేటి పాలకులు తుంగలోకి తొక్కుతున్నారు.  పంచాయతీల అభివృద్ధిపై చిన్న చూపు చూస్తున్నారు. ఎన్నికలు పూర్తయి పాలకవర్గాలు కొలువుదీరి ఏడాది కాలం ముగిసినా  ఇప్పటికీ ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాలు విడుదల చేయకపోవటం ఇందుకు తార్కాణంగా నిలుస్తోంది. దీంతో ఆయా పంచాయతీల పాలకవర్గాలు నిధులు ఎప్పుడు వస్తాయో అంటూ వేచి చూడాల్సిన పరిస్థితి దాపురించింది.
 
 ప్రోత్సాహకాల కోసం ఎదురుచూస్తున్న 129 పంచాయతీలు ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం గతంలో ప్రోత్సాహకాలు అందజేసింది. ఇదే తరహాలో గత ఏడాది జరిగిన పంచాయ తీ ఎన్నికల్లో జిల్లాలోని 129 పంచాయతీల్లో ఓటర్లంతా  ఏకగ్రీవంగా పాలకవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే ఆయా పంచాయతీలకు ఇప్పటికీ ప్రోత్సాహకాలు విడుదల కాలేదు. ప్రజాప్రతినిధుల పంచాయతీ పగ్గాలు చేపట్టి  సంవత్సరం పూర్తయినప్పటికీ ఈ విషయంపై ప్రభుత్వంలో కనీసం చలనం లేకపోవడం గమనార్హం. దీంతో ఆయా పంచాయతీ పాలకవర్గాలు నిధుల కోసం కళ్లుకాయ లు కాసేలా ఎదురుచూస్తున్నాయి.
 
 ఈ విషయంపై జిల్లాస్థాయిలో అధికారులను ప్రశ్నించినా తమకేమీ సమాచారం లేదని... ఏకగ్రీవ పంచాయతీల జాబితాను గతంలో ప్రభుత్వం ఆదేశాలతో పంపించామని సమాధానమిస్తున్నట్లు తెలుస్తోంది.   పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకునే ఉద్దేశంతో ఏకగ్రీవంగా  పాలకవర్గాలను ఎన్నుకుంటే  ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం పట్ల ఆయా పంచాయతీల ప్రజలు తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రూ.5లక్షలు మంజూరు చేస్తే పంచాయతీలో దీర్ఘకాలికంగా పేరుకుపోయిన సమస్యలను  పరిష్కరించుకోవాలన్న వారి కలలు కల్లలగానే మిగిలిపోతున్నాయి.  ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాల విడుదలపై జోక్యం చేసు కోవాలని కోరుతున్నారు.
 
 సర్పంచ్‌ల గౌరవవేతనాలదీ అదే పరిస్థితి
 ఇదిలా ఉండగా గ్రామ పంచాయతీ ప్రథమ పౌరులైన సర్పంచ్‌లకు ప్రభుత్వం ప్రతి నెలా  మంజూరు చేయాల్సిన గౌరవవేతనాలకు అతీగతీ లేదని పలువురు సర్పంచ్‌లు వాపోతున్నారు.  మూడేళ్ల ప్రత్యేకాధికారుల పాలన అనంతరం ఎన్నికైన పాలకవర్గాలపై ప్రభుత్వం చిన్న చూపు చూడడం తగదని వాపోతున్నారు. ఈ విషయంపై జిల్లావ్యాప్తంగా 921 పంచాయతీల సర్పంచ్‌లు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement