ఎందుకీ నిర్లక్ష్యం! | neglence in janumu cultivation | Sakshi
Sakshi News home page

ఎందుకీ నిర్లక్ష్యం!

Nov 28 2014 3:31 AM | Updated on Oct 1 2018 2:03 PM

రాష్ర్టంలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనే ఎక్కువగా జనపనార మిల్లులు ఉండడంతో ఈ రెండు జిల్లాల్లోని రైతులు ఎక్కువగా జనుము సాగు చేస్తున్నారు.

పండించిన పంట సిద్ధంగా ఉంటే ఎవరైనా ఏమి చేస్తారు. ఆయా ఉత్పత్తులకు సంబంధించి ఎవరు ఎక్కడ ఉన్నారో వెతికి మరీ వారి వద్దకు తీసుకు వెళ్లి విక్రయిస్తారు. నష్టమైనా, లాభమైనా సరుకు బయటకు వెళ్లిపోయేలా చూస్తారు. కానీ బొబ్బిలిలోని జూట్ కార్పొరేషన్ అధికారులు ఇందుకు విరు ద్ధంగా వ్యవహరిస్తున్నారు. రైతుల దగ్గర కొనుగోలు చేసిన జూట్‌ను ఏడాదిగా అమ్మకాలు చేయకుండా గోదాంలో ముగ్గ పెడుతున్నారు. దీంతో అసలే అంతంతమాత్రంగా ఉన్న ఈ శాఖలో ఉన్న కొద్ది మంది ఉద్యోగులు ఆ జూట్ గోదాంల్లో పదిలంగా ఉందా? ఏమైనా జరిగిందా అంటూ రోజూ వాకబు చే  సుకోవలసిన దుస్థితి నెలకొంది.
 
బొబ్బిలి : రాష్ర్టంలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనే ఎక్కువగా జనపనార మిల్లులు ఉండడంతో ఈ రెండు జిల్లాల్లోని రైతులు ఎక్కువగా జనుము సాగు చేస్తున్నారు. అయితే కొన్నేళ్లుగా విస్తీర్ణం బాగా తగ్గుముఖం పడుతోంది. గత ఏడాది సుమారు 2 వేల క్వింటాళ్ల వరకూ గోగును జేసీఐ ద్వారా కొనుగోలు చేసింది. జేసీఐ కొనుగోలు చేసిన జూట్‌ను ఎప్పటికప్పుడు మిల్లుకు పంపడం చేస్తుండాలి. అయితే జేసీఐ దగ్గరే కొనుగోలు చేయాలన్న నిబంధనలు కచ్చితంగా లేకపోవడంతో మిల్లుల యాజమాన్యం కూడా ప్రైవేటు వర్తకుల మీదే ఆధారపడుతున్నారు. గతేడాదికి సంబంధించి ఇంకా 327 బేళ్లు జూట్‌మిల్లు కొనుగోలు చేయక బొబ్బిలిలోని గోదాంల్లో మూలుగుతున్నాయి.

వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఉన్న గోదాంల్లో వీటిని నిల్వ చేశారు. దాదాపు 4 వందల క్వింటాళ్లు వరకూ ఇది ఉంటుంది. ఈ ఏడాది పొడవునా జేసీఐ అధికారులు దీన్ని విక్రయించడానికి అసలు ప్రయత్నాలు చేసిన దాఖ లాలు లేవు. దీంతో ఇక్కడ గోదాంలో ఉండే జూట్ ఏడాది కిందట బరువుకు, ఇప్పటికి చాలా వ్యత్యాసమే వచ్చి ఉంటుంది. ఇందంతా ఇప్పుడు జేసీఐకి న ష్టమే. ప్రభుత్వ నియమ నిబంధనలు కూడా కచ్చితంగా లేకపోవడం, మిల్లుల యజమాన్యాలకు సరైన దిక్సూచీ ఇవ్వకపోవడంతో ఇలాంటి సంఘటన లు చోటు చేసుకుంటున్నాయి.
 
ప్రైవేటు ధర 200 రూపాయల అధికం
ఈ ఏడాది జేసీఐ ప్రకటించిన మద్దతు ధర కంటే ప్రైవేటు ధర రెండు వందల రూపాయలు అధికంగా ఉండడంతో విజయనగరం, శ్రీకాకుళం జిల్లా లో ఉన్న 11 కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటివరకూ అసలు బోణీయే పడ లేదు. శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస, పొందూరు, రాజాం, కోటబొమ్మాళి లో, విజయనగరం జిల్లాలోని విజయనగరం, డొంకినవలస, బలిజిపేట, బొబ్బిలి, మక్కువ, గజపతినగరం, పార్వతీపురంల్లో కొనుగోలు కేంద్రాలున్నా యి. అటువైపు రైతులు ఈ ఏడాది కన్నెత్తి చూడని పరిస్థితి ఎదురైంది.

దీంతో జేసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద పనిముట్లు, బేళ్లు కట్టిన యంత్రాలన్నీ మూలకు చేరుకున్నాయి. కాగా ఈ విషయమై రీజనల్ మేనేజర్ రమణ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా బొబ్బిలిలోని గోదాంలోగత ఏడాది జూట్ నిల్వ ఉండడం వాస్తవమేనని చెప్పారు. వాటిని కొనుగోలు చేయడానికి ఏపీ ఫైబర్, విజయగనరంలోని రెండు జూట్ మిల్లులు ముందుకు వచ్చాయని తెలిపారు. త్వరలోనే వాటిని ఆయా మిల్లులకు తరలిస్తామన్నారు. మద్దతు ధర జేసీఐది తక్కువగా ఉండడం వల్ల రైతులు ఆసక్తి చూపడం లేదన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement