బొబ్బిలిలో భూ బకాసురులు | Encroached Lands In Bobbili | Sakshi
Sakshi News home page

బొబ్బిలిలో భూ బకాసురులు

Apr 22 2025 5:20 AM | Updated on Apr 22 2025 5:20 AM

Encroached Lands In Bobbili

పంటకు నీరు అందించేందుకు వేసిన బోరు, సోలార్‌ ప్యానళ్లు

ఎమ్మెల్యే తాలూకా అంటూ బెదిరింపులు

గిరిజనుల డీ–పట్టా, అటవీ భూముల దురాక్రమణ 

ఇప్పటికే 500 ఎకరాలు కబ్జా 

కేశాయవలసలో 30 ఎకరాల కబ్జా.. వెదురు కంచె ఏర్పాటు  

బోర్లు తవ్వి, సోలార్‌ ప్యానెళ్లు బిగించి టేకు మొక్కల పెంపకం 

తమకేమీ తెలీదంటున్న రెవెన్యూ యంత్రాంగం 

బొబ్బిలి రూరల్‌ :  విజయనగరం జిల్లా బొబ్బిలిలో భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. గిరిజనులను బెదిరించి డీ–పట్టా భూములను కబళిస్తున్నారు. అటవీ భూములను ఆక్రమించి సాగుభూములుగా మలుస్తున్నారు. ఎవరైనా ప్రశ్చిస్తే బొబ్బిలి టీడీపీ ఎమ్మెల్యే బేబీనాయన మనుషులమంటూ హడలెత్తిస్తున్నారు. అమాయక గిరిజనుల కళ్లుగప్పి భూమిని కాజేస్తున్నారు. బొబ్బిలి మండలంలోని మోసూరువలస, డొంగురువలస, కేశాయవలస, కొత్తవలస తదితర గిరిజన గ్రామాలకు వెళ్తే ఆక్రమణదారులు వెదురు కంచెలు నిర్మించి సాగుచేస్తున్న మా­మిడి, జీడి, టేకు వనాలు సాక్షాత్కరిస్తాయి.  

దురాక్రమణలు ఇలా.. 
గోపాలరాయుడుపేట, చిత్రకోటబోడ్డవలస, కాశిందొరవలస తదితర గ్రామ పంచాయతీల పరిధిలో వందల ఎకరాల అటవీ భూములున్నాయి. వీటిని టీడీపీ నేతలు, అధికారుల అండతో బడాబాబులు పక్కా స్కెచ్‌తో ఆక్రమిస్తున్నారు. ఒడిశా సరిహద్దు గ్రామాల నుంచి కొన్ని కుటుంబాలను ముందుగా రప్పిస్తున్నారు. వారి నివాసం కోసం ఆక్రమించేందుకు సిద్ధమైన భూముల్లో చిన్నచిన్న గుడారాలు ఏర్పాటుచేస్తున్నారు. ఆ తర్వాత అక్కడి అటవీ భూముల్లో చెట్లను నరికి సాగుభూములుగా మారుస్తున్నారు. నెలలు గడిచాక పట్టాలివ్వాలంటూ వారితో ప్రభుత్వానికి దరఖాస్తు చేయిస్తున్నారు.

అనంతరం.. అధికారులపై ఒత్తిడి తెచ్చి వారి పేరున డీ–పట్టాలు ఇప్పిస్తున్నారు. ఎంత భూమి ఇస్తున్నారన్న విషయం కూడా ఆ వలస జీవులకు తెలీదు. పట్టాలు వచ్చిన వెంటనే వారితో కాగితాలపై సంతకాలు చేయించి ఇక్కడ పనిలేదంటూ మరో ప్రాంతానికి పంపిస్తున్నారు. ఇలా ఇప్పటికే సుమారు 500 ఎకరాల ప్రభుత్వ, అటవీ భూములు బడాబాబుల హస్తగతమయ్యాయి. వీరి భూదాహంవల్ల తాతల కాలంలో ఉండే అడవులు, అటవీ జంతువులు కనుమరుగవుతున్నాయని స్థానిక గిరిజనులు చెబుతున్నారు. రెవెన్యూ, అటవీ శాఖ అధికార యంత్రాంగం సమగ్ర దర్యాప్తు చేస్తే భూముల ఆక్రమణ వ్యవహారం బయటపడుతుందన్నది గిరిజన సంఘాలు చెబుతున్నాయి.

ఆక్రమణలు వెలుగులోకి ఇలా..
సీహెచ్‌ బొడ్డువలస గ్రామపంచాయతీ కేశాయవలస గిరిజన గ్రామానికి ఆనుకుని ఉన్న ఆక్రమిత భూమిలో టేకు మొక్కలకు నీళ్లుపోసే వాటర్‌ ట్యాంకు ట్రాక్టర్‌ను నడుపుతున్న డ్రైవర్‌ పోలిరాజు గతనెల 28న  ప్రమాదవశాత్తు మృతిచెందాడు. అక్క­డకు వెళ్లిన మీడియా ప్రతినిధులు, అధికారులు.. ఇంత పెద్దఎత్తున టేకు మొక్కలు సాగుచేస్తున్నది ఎవరని ఆరా తీయగా అక్కడివారు మొదట ఎమ్మెల్యే బేబినాయన అని, ఎమ్మెల్యే అనుచరుల­దని చెప్పు­కొచ్చారు.

విశాఖపట్నంలో నివసిస్తున్న ఎమ్మెల్యే అనుచరుడిదని గిరిజనులు తెలిపారు. టేకు మొక్కలు వేసిన దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో వెదురు ఫెన్సింగ్‌ ఏర్పాటుచేశారు. సోలార్‌ ప్యానెళ్లతో విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుంటూ అటవీ, డీ–పట్టా భూముల్లో తోటలు పెంచుతున్నారు. సారవంతమైన ఎర్రరేగడి నేల కావడంతో అమాయక గిరిజనులను భయపెట్టి సొంతం చేసుకున్నట్లు సమాచారం. మారుమూల గిరిజన గ్రామం కావడంతో రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడంలేదు. అసలా భూములు ఎవరికి చెందినవో, ఏ పంచాయతీ పరిధిలోకి వస్తాయో కూడా రెవెన్యూ అధికారులకు తెలీకపోవడం విచిత్రం.  

ఆక్రమణల గురించి నాకేం తెలీదు.. 
గిరిజనుల డీ–పట్టా భూముల ఆక్రమణ వ్యవహారం నాకేమీ తెలీదు. ఫిర్యాదు వస్తే సమగ్ర దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటాం.  
– ఎం. శ్రీను, బొబ్బిలి తహసీల్దార్‌  

తెలుసుకుని చెబుతా.. 
నేను ఇక్కడకు కొత్తగా వచ్చాను. కొండ భూములను ఇంత పెద్దస్థాయిలో ఎవరు సాగుచేస్తున్నారో తెలీదు. వివరాలు తెలుసుకుని అధికారులకు నివేదిక అందిస్తాను.      – పోలినాయుడు,   వీఆర్వో, సీహెచ్‌ బొడ్డవలస   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement