
ఏపీపై కలలు కనడానికి చాలా టైం ఉంది
ఎప్పుడూ తాను కన్న కలలు నిజమవుతాయని పార్లమెంటరీ వ్యవహా రాల మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు.
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడూ తాను కన్న కలలు నిజమవుతాయని పార్లమెంటరీ వ్యవహా రాల మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘నేను కలలు కనడం తక్కువే. కన్న కలల్లో వచ్చినవన్నీ జరిగాయి. చిన్నప్పుడు పార్టీ కార్యకర్తగా పోస్టర్లు అంటించేటప్పుడు వాజ్పేయి ప్రధాని కావాలని కల కన్నా. నిజమైంది. ఆయన వద్ద మంత్రిగా పనిచేశా. బీజేపీకి కేంద్రంలో సంపూర్ణ మెజార్టీ రావాలని కలగన్నా. మోడీ ఆధ్వర్యంలో అదీ జరిగింది. మహారాష్ట్రలో పార్టీ గెలిచినట్టు కలొచ్చింది. అదీ నెరవేరింది.
కోల్కతా (పశ్చిమ బెంగాల్) వైపు కలలొస్తున్నాయి. అదీ నెరవేరుతుంది’’ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ గురించి కలలు రావడం లేదా అని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘‘చూద్దాం. చాలా టైం ఉందిగా’’ అని ఆయన బదులి చ్చారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరగకుండా కాంగ్రెస్ పార్టీ తమాషాలు చేస్తోందని వెంకయ్య విమర్శించారు. రాజ్యాంగం పట్ల నమ్మకమే లేని కమ్యూనిస్టులు కూడా రాజ్యాం గం గురించి మాట్లాడుతున్నారంటూ సీపీఎం సభ్యుడు సీతారాం ఏచూరి చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు, తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలు కె. లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి కూడా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.