వైఎస్ విజయమ్మ దీక్షకు మద్దతుగా ఏలూరు ఎమ్మెల్యే ఆళ్లనాని మంగళవారం ఏలూరులో దీక్ష చేపట్టారు.
ఏలూరు: సీమాంధ్ర ప్రజల తరఫున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టిన సమర దీక్షకు ‘పశ్చిమ’ ప్రజలు జేజేలు పలుకుతున్నారు. ఆమె దీక్షకు మద్దతుగా ఎమ్మెల్యే ఆళ్లనాని (కాళీ కృష్ణ శ్రీనివాస్)మంగళవారం ఏలూరులోని ఫైర్ స్టేషన్ సెంటర్లో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి బతికుంటే రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు. విజయమ్మ సమర దీక్ష చారిత్రాత్మకమని ఆయన అన్నారు. చంద్రబాబునాయుడు వైఖరి వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చిందని ఆళ్లనాని మండిపడ్డారు.
బాబు బస్సుయాత్ర చేపడితే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు ఇప్పటికైనా రాజీనామా చేసి ప్రజా ఉద్యమంలో పాల్గొనాలని ఆళ్లనాని డిమాండ్ చేశారు. కాగా సమైక్యాంధ్రకు మద్దతుగా ఏలూరులో నేడు, రేపు విద్యాసంస్థలు బంద్ పాటిస్తున్నాయి. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన కొల్లేరు ప్రజలు భారీ ర్యాలీ చేపట్టారు. 22వ తేదీన ఏలూరులో పది వేలమంది రైతులతో భారీ ర్యాలీతోపాటు ధర్నా నిర్వహించనున్నారు.