నీచ రాజకీయాలు మానుకో.. | Miserable Politics stop.. | Sakshi
Sakshi News home page

నీచ రాజకీయాలు మానుకో..

May 28 2014 2:04 AM | Updated on Oct 20 2018 6:17 PM

నీచ రాజకీయాలు చేయడం మానుకోవాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ నాయకుడు భూమన కరుణాకర్‌రెడ్డి హితవు పలికారు.

- చంద్రబాబుకు భూమన హితవు
 నెల్లూరురూరల్, న్యూస్‌లైన్ :నీచ రాజకీయాలు చేయడం మానుకోవాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ నాయకుడు భూమన కరుణాకర్‌రెడ్డి హితవు పలికారు. వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ సభ్యులతో పార్టీ సీజీసీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో కనుపర్తిపాడులోని వీపీఆర్ కన్వెన్షన్‌లో మంగళవారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ పార్టీ తరఫున ఎన్నికల్లో గెలుపొందిన వారిని టీడీపీ నాయకులు ప్రలోభాలకు గురిచేయడం సిగ్గుచేటన్నారు.
 
 కోడిపిల్లలను రాబంధులు ఎత్తుకెళ్లినట్లు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఎత్తుకెళ్లేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని ధ్వజమెత్తారు. ఆయన ఎత్తుగడలు ఫలించబోవన్నారు. కడప తర్వాత నెల్లూరు జిల్లాలోనే వైఎస్సార్‌సీపీకి ప్రజాదరణ ఎక్కువగా ఉందని ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయన్నారు. తమ పార్టీ తరపున ఎన్నికల్లో గెలుపొందిన వారు జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోనే ముందుకు సాగుతున్నారని స్పష్టం చేశారు. పార్టీ అధికారంలోకి రాలేదని ఎవరూ బాధపడవద్దన్నారు.
 
 వైఎస్సార్‌సీపీకి మంచి రోజులు రానున్నాయన్నారు. నెల్లూరు జెడ్పీ చైర్మన్‌గా బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిని ఎన్నుకోవాలని ఆయన పార్టీ జెడ్పీటీసీ సభ్యులకు పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్ మాట్లాడుతూ జిల్లాలో వైఎస్సార్‌సీపీ బలంగా ఉందన్నారు. ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతో పాటు, ఎక్కువ సంఖ్యలో కార్పొరేటర్, కౌన్సిలర్ స్థానాలు వైఎస్సార్‌సీపీకి దక్కాయన్నారు. టీడీపీ నేతల ప్రలోభాలకు తలొగ్గరాదని జెడ్పీటీసీ సభ్యులకు సూచించారు. రాఘవేంద్ర రెడ్డిని జెడ్పీ చైర్మన్‌గా ఎన్నుకోవాలని కోరారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ నాయకులు కొందరు టీడీపీలో చేరుతున్నారని వదంతులు రావడం బాధాకరమన్నారు.
 
 జెడ్పీటీసీ సభ్యులు టీడీపీ నేతల ప్రలోభాలు, ఒత్తిళ్లకు లొంగకుండా వైఎస్సార్‌సీపీకి అండగా నిలవాలన్నారు. జెడ్పీ చైర్మన్ అభ్యర్థి బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో వైఎస్సార్‌సీపీ 31 జెడ్పీటీసీలను కైవసం చేసుకుందని, సభ్యులెవరూ పార్టీని వీడే ప్రసక్తే లేదన్నారు. తమ పార్టీ జెడ్పీటీసీ సభ్యులను ప్రలోభపెట్టేందుకు టీడీపీ కుట్ర చేయడం సిగ్గుచేటన్నారు. తాను చైర్మన్‌గా ఎన్నికైన వెంటనే జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తానని, సభ్యులందరూ సహకరించాలని కోరారు.
 
 సమావేశంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, పార్టీ వెంకటగిరి సమన్వయకర్త కొమ్మి లక్ష్మయ్యనాయుడు, కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, సీజీసీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 
 వీపీఆర్‌లో కోలాహలం
 వైఎస్సార్‌సీపీ నేతలు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు, కార్పొరేటర్లతో రెండు రోజులుగా కనుపర్తిపాడులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్ కోలాహలంగా మారింది. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు, పార్టీ చర్చల్లో నిమగ్నమయ్యారు. నాయకులు భూమన కరుణాకర్‌రెడ్డి, ఆయా ప్రాంతాల రాజకీయ పరిస్థితులపై నాయకుల ద్వారా తెలుసుకున్నారు. మంగళవారం ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించిన జెడ్పీటీసీలు, నాయకులతో వేర్వేరుగా సమావేశమయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement