ఆ దమ్ము చంద్రబాబుకు ఉందా..? | Minister Anil Kumar Yadav Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

ముస్లింలకు అన్యాయం జరగదు

Feb 7 2020 5:00 PM | Updated on Feb 8 2020 9:58 PM

Minister Anil Kumar Yadav Comments On Chandrababu - Sakshi

సాక్షి, నంద్యాల: రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగినా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సహించరని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. శుక్రవారం కర్నూలు జిల్లా నంద్యాలలో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ముస్లింలకు అన్యాయం జరిగితే మౌనంగా ఉండే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎన్‌ఆర్‌సీని రాష్ట్రంలోకి రానిచ్చే ప్రసక్తే లేదని సీఎం వైఎస్‌ జగన్‌ సృష్టం గా చెప్పారని తెలిపారు. నంద్యాలలో ఎక్కువ శాతం ముస్లింలు ఉన్నారని.. తాను నెల్లూరు రాజకీయాల్లో పోటీ చేసిన ప్రతీసారి ముస్లిం లు వలనే గెలవగలిగానని ఆయన పేర్కొన్నారు.

టీడీపీ ఎంపీలు ఎందుకు మాట్లాడలేదు..?
సున్నితమైన అంశాలను రాజకీయం చేయడం మంచిది కాదని మంత్రి అనిల్‌ తెలిపారు. పార్లమెంటులో తమ ఎంపీ మిథున్‌ రెడ్డి ఎన్‌ఆర్‌సీని వ్యతిరేకిస్తూ మాట్లాడారని.. టీడీపీ ఎంపీలు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. అమరావతి అంటూ.. చంద్రబాబుకు జోలె పట్టుకుని బిక్షాటన చేయడం మాత్రమే తెలుసునని.. ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌, సీఏఏపై మాట్లాడే దమ్ము లేదని దుయ్యబట్టారు. కేవలం 29 గ్రామాల కోసం ఆయన బినామీ, బంధువుల ఆస్తులు పోతాయని జోలె పట్టుకుని తిరుగుతున్నారని విమర్శించారు.

ఆయన సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు..
151 అసెంబ్లీ సీట్లు సాధించి.. దేశంలోనే చరిత్ర సృష్టించిన వైఎస్సార్‌సీపీ లాంటి పార్టీని గాలిలో కలుపుతామంటారా అంటూ టీడీపీపై నిప్పులు చెరిగారు. సీఎం వైఎస్‌ జగన్‌ 10 సంవత్సరాల తన రెక్కల కష్టంతో.. 3 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల మన్ననలు పొంది సంచలన విజయం సాధించారని పేర్కొన్నారు. సొంత మామకే వెన్నుపోటు పొడిచి టీడీపీని లాక్కున చంద్రబాబు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్‌ పెట్టిన తెలుగుదేశం పార్టీని పక్కన పెట్టి.. దమ్ముంటే సొంతగా పార్టీ పెట్టి గెలవాలని చంద్రబాబుకు మంత్రి అనిల్‌కుమార్‌ సవాల్‌ విసిరారు. ఎన్టీఆర్‌ పెట్టిన పార్టీపై మమకారంతో చంద్రబాబుకు ఓట్లు వస్తున్నాయి తప్ప.. ఆయన ముఖం చూసి కాదన్నారు. లేకుంటే చంద్రబాబుకు డిపాజిట్లు కూడా రావని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మూడో నేత్రం తెరిస్తే చంద్రబాబు భస్మం అవుతాడని.. కానీ ఆయనలో క్షమా,దయా గుణం ఉండటంతో టీడీపీ ఎన్ని కుట్రలు చేస్తున్నా సహిస్తున్నారని మంత్రి అనిల్‌ పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement