బాబు జమానాలో దళితులకు దగా | Sakshi
Sakshi News home page

బాబు జమానాలో దళితులకు దగా

Published Sat, Jan 24 2015 3:03 AM

Meruga nagarjuna slams chandrababu Naidu's govt

సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు దళితులను దగా చేస్తోందని, ఉద్దేశపూర్వకంగానే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను దారి మళ్లించే ప్రయత్నం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ మేరుగ నాగార్జున విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ‘ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలు’ అనే అంశంపై శుక్రవారం విజయవాడ ప్రెస్ క్లబ్‌లో చర్చా వేదికను నిర్వహించారు. ఈ వేదికకు అధ్యక్షత వహించిన నాగార్జున..మాట్లాడుతూ సీఎంగా బాబు 7 నెలల పాలనాకాలంలో దళితులను నిర్లక్ష్యం చేశారన్నారు.
 
 దివంగత వైఎస్ హయాంలో ఎస్సీ, ఎస్టీల కోసం ఎన్నో కార్యక్రమాలు  చేశారని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి ఉద్యమించేందుకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందుంటారన్నారు. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి ప్రత్యేకంగా బడ్జెట్‌ను ప్రవేశ పెట్టాలని చర్చా వేదికలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మెండెం జయరాజు డిమాండ్ చేశారు. 50 ఏళ్లయినా ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలు కావడం లేదని తెలంగాణ రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి ఏపీ ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు నల్లా సూర్యప్రకాశరావు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement