సాక్షి, గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబును వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించారు. అంబటి ఇంటిపై దాడి చేసి.. ఆయన్నే అరెస్ట్ చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అరెస్టు చేస్తే భయపడుతారు అనుకోవద్దని హెచ్చరించారు. రాంబాబు ఇంటిపై దాడి బాధాకరమని అన్నారు. మాజీ మంత్రి అంబటిని కలిసిన వారిలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం ఉన్నారు.
అనంతరం, మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ..‘అంబటి రాంబాబు ఇంటిపై ఏడు గంటలపాటు దాడి చేశారు. చెరపకురా చెడేవు అన్న సామెత గుర్తుపెట్డుకోండి. దాడులపై ప్రజలకు ఏం సమాధానం చెబుతారు?. ముద్రగడ లాంటి వ్యక్తులపై కూడా దాడి చేశారు. మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు అందరి లెక్కలు సరిచేస్తామని హెచ్చరించారు.
ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ..‘రాంబాబు కుమార్తె ఫైర్ బ్రాండ్ మౌనికను పలకరించడానికి వచ్చాను. భవిష్యత్తులో మమతా బెనర్జీ స్థాయికి మౌనిక వెళ్లాలి. మాజీ మంత్రి ఇంటిపై దాడి బాధాకరం. రెండు సార్లు కాపుల సాయంతో చంద్రబాబు సీఎం అయ్యారు. చంద్రబాబు.. నన్ను నా కుటుంబాన్ని వేధించారు. మాకు జరిగిన అవమానాలు మీకు మీ భార్య, కొడుకు, కోడలికి జరిగితే ఎలా ఉంటుంది?. మేం బానిసలం కాదు. తిరుమల లడ్డుపై రోజూ అబద్దాలు ఆడుతున్నారు. మీ అబద్దాలను ఇకనైనా ఆపి క్షమాపణలు చెప్పండి. క్షమాపణ లేకపోయినా ఫరవాలేదు.. మాట్లాడడం ఆపేయండి. మీ ఉద్దేశం ఏంటి? అందరినీ జైలులో పెట్టాలనా?. ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు.. సద్వినియోగం చేసుకోండి. మా ఇళ్లపై దాడిచేసే కార్యక్రమాలకు స్వస్తి పలకండి అని హెచ్చరించారు.
మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. ‘అరెస్టు చేసి జైలులో పెట్టడం ఎంతవరకు సమంజసం. అరెస్టు చేస్తే భయపడుతారు అనుకోవద్దు. అంబటి రాంబాబు, జోగి రమేష్, చెవిరెడ్డిని అరెస్టు చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేశారు. మీరు ఏం చేస్తానన్నా మేం బయటకు వస్తాం. నాలుగుసార్లు సీఎం అయిన చంద్రబాబుకు ఏ విధంగా పాలించాలో తెలియదా?. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తుకు గట్టి పునాది వేస్తున్నారు. అరెస్టులు ఇప్పటికైనా ఆపండి. తిరుమల లడ్డులో కల్తీ లేదని తేలింది అంటూ వ్యాఖ్యలు చేశారు.


