తాడేపల్లి: ల్యాండ్ పూలింగ్లో అవినీతి జరిగిందని మాజీ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. అమరావతిలో పేదలు ఉండకూడదని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. రాజధానిలో అంతులేని దోపిడీ జరుగుతోందని ఆరోపించారు.
ఇవాళ మేరుగు నాగార్జున మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పూర్తిగా పడకన పడ్డాయి. రాజధానిలో ఎకరం రూ.50 కోట్లు ఉందంటూ ప్రచారం చేస్తున్నారు. వారు మాత్రం ఐదు ఎకరాలను కూడా రూ.3.5 కోట్లకే ఎలా కొన్నారు? అంటే జనాన్ని మోసం చేస్తున్నారా? లేక సీఆర్డీఏకి ట్యాక్సులు ఎగ్గొట్టారా?
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 50 వేలమంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే చంద్రబాబు రద్దు చేశారు. చంద్రబాబు మాత్రం భారీ బంగ్లాలు కట్టుకోవచ్చుగానీ పేదలు మాత్రం ఇళ్లు కట్టుకో కూడదా? ఇదేనా చంద్రబాబు రాజనీతి? చివరికి చంద్రబాబు ఇంటి చుట్టుపక్కల కూడా ఎవరూ ఉండకుండా గ్రీన్ జోన్ ప్రకటించటం అన్యాయం. రెండు లక్షల కోట్ల ప్రజాధనంతో ఏర్పాటు చేసే మౌలిక సదుపాయాలు ఎవరి కోసం?’’ అని మేరుగు నాగార్జున నిలదీశారు.


