బంటుమిల్లి-బందరు మండలాల సరిహద్దుల్లోని ఉప్పు కాలువ (సాల్ట్ క్రీక్) పరీవాహక ప్రాంతంలో మడ అడవులు విస్తరించి ఉన్నాయి.
మచిలీపట్నం / బంటుమిల్లి : బంటుమిల్లి-బందరు మండలాల సరిహద్దుల్లోని ఉప్పు కాలువ (సాల్ట్ క్రీక్) పరీవాహక ప్రాంతంలో మడ అడవులు విస్తరించి ఉన్నాయి. కొంతమంది బడా బాబులు, ప్రజాప్రతినిధులు మడ అడవులపై కన్నేసి వ్యూహాత్మకంగా వాటిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తమ పలుకుబడిని ఉపయోగించి అధికారులను మచ్చిక చేసుకుని మడ అడవులను నరికి చెరువులు తవ్వేస్తున్నారు.
ఆక్రమణలు సాగేదిలా...
వేసవి ప్రారంభం కావడంతో బంటుమిల్లి మండలం నారాయణపురం, బందరు మండలం పెదపట్నం, కానూరు గ్రామాల పరిధిలో మడ అడవులను నరికే కార్యక్రమం వేగవంతం చేశారు. ఈ గ్రామాలకు చెందిన కొంతమంది పెద్ద మనుషులు తొలుత మడ చెట్లు నరికి చిన్న, చిన్న చెరువులుగా మనుషులతో తవ్వేపనిని వేగవంతం చేశారు. ఈ రెండు మండలాల్లో మడ అడవులు విస్తరించి ఉన్న గ్రామాల పరిధిలో గ్రామ స్థాయి అధికారుల కనుసన్నల్లోనే చేపల చెరువుల తవ్వకాలు జోరుగా సాగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి.
తొలుత మడ అడవులను చిన్న చిన్న చెరువులుగా మార్చి, అనంతరం ఈ భూములను భూస్వాములకు అమ్మి సొమ్ము చేసుకోవడం ఇక్కడ రివాజుగా మారింది. మడ అడవుల్లోని భూములను కొనుగోలు చేసిన భూస్వాములు యంత్రాలు, ట్రాక్టర్ల సాయంతో రాత్రివేళల్లో వాటిని చేపల చెరువులుగా మార్చేస్తున్నారు. ఈ విధంగా ఇప్పటికే వేలాది ఎకరాల మడ అడవులు చెరువులుగా మారిపోతున్నాయి. ప్రభుత్వ భూముల్లో ఉన్న మడ అడవులను నరకడం, వాటిని తమ భూములుగా చూపి బడా బాబులకు అమ్మేయడం యథేచ్ఛగా సాగుతున్నా రెవెన్యూ అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం.
భూముల పేరుతో సొమ్ముల వసూలు
సాల్ట్ క్రీక్ పరిధిలో ఉన్న భూముల్లో పట్టాలు ఇప్పిస్తామంటూ పెదపట్నం ప్రాంతానికి చెందిన కొంతమంది ఏజెంట్లు పలువురి వద్ద భారీగా సొమ్ములు వసూలు చేసినట్టు సమాచారం. అందులో భాగంగా ఇటీవల ఉప్పు కాలువ సమీపంలో రాత్రివేళల్లో పొక్లెయిన్ల సాయంతో పెద్ద పెద్ద చెరువుల తవ్వకాన్ని చేపట్టారు. వాటికి సమీపంలో మాగాణి భూములు ఉండటంతో సంబంధిత రైతులు అభ్యంతర పెట్టగా ఆక్రమణదారులు ఆ ప్రాంతంలో తాత్కాలికంగా పనులు నిలిపివేశారు.
భూములకు పెరిగిన గిరాకీ
బంటుమిల్లి-మచిలీపట్నం గ్రామాల మధ్య తుపాను ప్రత్యేక నిధుల తో నారాయణపురం, పెదపట్నం గ్రామాల మీదుగా లింక్ రోడ్డు ఏర్పడటంతో ఈ రోడ్డు పరిధిలో ఉన్న భూములకు గిరాకీ ఏర్పడింది. సాల్ట్ క్రీక్పై వంతెన నిర్మాణం త్వరలో పూర్తి కానున్న తరుణంలో కాలువకు రెండు వైపులా ఉన్న మడ అడవిపై భూస్వాముల కన్ను పడింది. దీంతో ఆక్రమణదారులు అయినకాడికి సొమ్ము చేసుకునేందుకు తమ పనులు వేగవంతం చేసినట్టు సమాచారం. రోడ్డు ఏర్పడకముందు వేలల్లో ఉన్న భూములు నేడు లక్షలు పలుకుతున్నాయి.
సుప్రీం ఆదేశాలు బేఖాతరు
తీర ప్రాంతాల్లో పర్యావరణం దె బ్బతినకుండా ఉండేందుకు మడ చెట్లు ఎక్కడ మొలిచినా తొలగించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్థానిక అధికారులు బేఖాతరు చేస్తున్నారన్న విమర్శలు తలెత్తుతున్నాయి. జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా సుమారు 1500 ఎకరాల్లో మడ చెట్లు పెంచాలని ప్రభుత్వం రూపకల్పన చేసింది. అందులో భాగంగా పాలకాయితిప్ప, కోడూరు, నాగాయలంక గ్రామాల్లో ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి.
సంబంధిత శాఖ అధికారులు ప్రారంభోత్సవాలు కూడా చేయడం గమనార్హం. ఈ స్థితిలో రెవెన్యూ అధికారులు సొమ్ముల కోసం ఆక్రమణదారులకు పరోక్షంగా సహకరిస్తున్నారన్న విమర్శలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి ఆక్రమణకు గురైన మడ భూములను స్వాధీనం చేసుకుని తిరిగి ఆ భూముల్లో మడ చెట్ల పెంపకాలకు చర్యలు తీసుకోవాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు.