
ఆదర్శ రైతులకు మంగళం
‘జాబు కావాలంటే బాబు రావాలి...’ ఇది ఎన్నికల ముందు టీడీపీ నాయకులు పదేపదే వల్లెవేసిన మాట... బాబు అధికారంలోకి వచ్చారు.
- జీవో నంబరు 43 విడుదల చేసిన ప్రభుత్వం
- జిల్లాలో 1,750 మంది ఇంటిముఖం
- ఎంపీఈవోల వ్యవస్థ తెచ్చే యోచనలో సర్కారు
నూజివీడు : ‘జాబు కావాలంటే బాబు రావాలి...’ ఇది ఎన్నికల ముందు టీడీపీ నాయకులు పదేపదే వల్లెవేసిన మాట... బాబు అధికారంలోకి వచ్చారు. కానీ, కొత్తవారికి జాబు రాకపోగా, ఉన్న వారిని కూడా ఇంటికి పంపించేస్తున్నారు. ఇప్పటికే గృహనిర్మాణ శాఖలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ వర్క్ ఇన్స్పెక్టర్లను ఇంటికి పంపిన టీడీపీ ప్రభుత్వం... తాజాగా వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న ఆదర్శ రైతులను తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆదర్శ రైతుల వ్యవస్థను రద్దు చేస్తూ శుక్రవారమే జీవో నంబరు 43ను విడుదల చేసింది. దీంతో జిల్లాలో దాదాపు 1,750 మంది ఆదర్శ రైతులు ఇంటిముఖం పట్టనున్నారు.
రైతులు, అధికారులకు వారధిగా...
రైతులకు, వ్యవసాయాధికారులకు మధ్య సంధానకర్తగా పనిచేసేందుకు 2007లో అప్పటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఆదర్శ రైతు వ్యవస్థను ఏర్పాటు చేసింది. పదో తరగతి ఉత్తీర్ణులైన వారిని ప్రతి 250 రైతు కుటుంబాలకు ఒకరిని చొప్పున నియమించింది. వీరికి నెలకు వెయ్యి రూపాయల గౌరవ వేతనం చెల్లించేవారు. వీరికి దాదాపు రూ.10 లక్షల వ్యయంతో పలుమార్లు శిక్షణనిచ్చి పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైనవారినే కొనసాగిస్తూ, పనితీరు బాగోలేని వారిని తొలగిస్తూ వచ్చింది.
నియమితులైన ఆదర్శ రైతులు వ్యవసాయాధికారులకు, రైతులకు మధ్య వారధిలా ఉంటూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, రైతుచైతన్య యాత్రలకు రైతులు వచ్చేలా చూడటం, యాంత్రీకరణలో భాగంగా ప్రభుత్వం ఇస్తున్న రాయితీలను క్షేత్రస్థాయిలో రైతులకు తెలియజేయడం, వ్యవసాయ శాఖ అమలుపరిచే పలు విషయాలను సకాలంలో రైతులకు తెలియజేయడం వంటి పనులు వీరు చేస్తున్నారు.
తుపాను బారిన పడిన పొలాలకు వెళ్లి దెబ్బతిన్న పంటల నమోదులోనూ వ్యవసాయాధికారులకు తమ సహకారాన్ని అందించేవారు. ఈ ఆదర్శ రైతు వ్యవస్థను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి తీసుకువచ్చారనే అక్కసుతో దీనిని రద్దు చేస్తారనే ప్రచారం టీడీపీ ప్రభుత్వం వచ్చాక జరిగింది. దానికి తగ్గట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
మళ్లీ పాత విధానమే...
1999-2004 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం వ్యవసాయ శాఖలో బహుళ ప్రయోజన విస్తరణాధికారుల(ఎంపీఈవో)ను కాంట్రాక్టు పద్ధతిపై నియమించింది. అగ్రికల్చర్ బీఎస్సీ చదివినవారు ఐదువేల ఎకరాల విస్తీర్ణానికి ఒకరు చొప్పున మండలానికి నలుగురు నుంచి ఆరుగురు వరకు పనిచేసేవారు. వీరు వ్యవసాయాధికారులకు సహాయకారిగా మాత్రమే ఉండేవారు తప్ప, రైతులతో మమేకమయ్యేవారు కాదు. ఎక్కడో పట్టణ ప్రాంతంలో నివసిస్తూ వేళకు విధులకు హాజరై వెళ్లిపోయేవారు. ఆదర్శ రైతులను తొలగించిన నేపథ్యంలో ప్రభుత్వం మరల ఈ ఎంపీఈవోల వ్యవ స్థను తీసుకురావాలని భావిస్తోంది.
ఆదర్శ రైతులు 250 కుటుంబాలకు ఒకరు చొప్పున ఉండటంతో రైతులకు అందుబాటులో ఉండేవారు.
ప్రభుత్వ పథకాలు సకాలంలో రైతులకు చేరేవి.
పంట నష్టం అంచనాల నమోదులోనూ అధికారులతో కలసి క్షేత్రస్థాయికి వెళ్లి సహకారం అందించేవారు.
ఆదర్శ రైతుల స్థానంలో మళ్లీ ఎంపీఈవోల వ్యవస్థను తీసుకురావాలని టీడీపీ ప్రభుత్వం భావిస్తోంది.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ వ్యవస్థ కొనసాగింది. మండలానికి నలుగురు నుంచి ఆరుగురు మాత్రమే ఉండటం వల్ల వీరు రైతులకు పెద్దగా అందుబాటులో ఉండేవారు కాదు.