విషాదం: కొడుకు బిగ్గరగా అరిచి చెప్పడంతో.. | Man Felt Wrongly As Covid Positive Reported Last Breath In West Godavari | Sakshi
Sakshi News home page

విషాదం: కొడుకు బిగ్గరగా అరిచి చెప్పడంతో..

Jul 17 2020 8:54 AM | Updated on Jul 17 2020 9:54 AM

Man Felt Wrongly As Covid Positive Reported Last Breath In West Godavari - Sakshi

ఏలూరు టౌన్‌: ‘నాన్నా నీకు కరోనా నెగిటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది’ అని తండ్రికి కొడుకు బిగ్గరగా చెప్పగా.. అది అర్థం కాక తనకు కరోనా వచ్చేసిందనే తీవ్ర ఆందోళనతో ఆ తండ్రి అక్కడికక్కడే కుప్పకూలాడు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని బడేటి వారి వీధికి చెందిన కె.అప్పారావు (62) తన కుమారుడితో కలిసి కరోనా నిర్థారణ పరీక్ష చేయించుకునేందుకు గురువారం ఏలూరు వన్‌టౌన్‌లోని మొబైల్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ సంజీవని బస్సు వద్దకు వచ్చాడు. టెస్టు అనంతరం అప్పారావు అక్కడే ఫలితం కోసం వేచిచూస్తున్నాడు. నెగిటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది.

కుమారుడు వచ్చి నాన్న నీకు నెగిటివ్‌ రిపోర్ట్‌ వచ్చిందని గట్టిగా చెప్పాడు. నెగిటివ్‌ రిపోర్ట్‌ అనే మాట అర్థం కాని అప్పారావు తనకు కరోనా వచ్చేసిందనే ఆందోళనతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అక్కడ ఉన్న వైద్య సిబ్బంది అప్పారావుకి రెస్పిరేటరీ సిస్టమ్‌ ద్వారా శ్వాస అందించేందుకు ప్రయత్నించారు. 108 సిబ్బంది ప్రాథమిక చికిత్స చేసి వెంటనే ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే అప్పారావు మృతి చెందినట్లు ధృవీకరించారు. కాగా, అప్పారావు మృతదేహానికి గురువారం రాత్రి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 
(ఆక్సిజన్‌ అందకే నా భర్త మృతి చెందాడు)

Advertisement
 
Advertisement
Advertisement