మందమర్రి పట్టణంలోని పాత బస్టాండ్ రాష్ట్రీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో స్థానిక విద్యానగర్ చెంచు కాలనీకి చెందిన మేకల రత్నాకర్(23) దుర్మరణం చెందాడు.
మందమర్రి రూర ల్, న్యూస్లైన్: మందమర్రి పట్టణంలోని పాత బస్టాండ్ రాష్ట్రీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో స్థానిక విద్యానగర్ చెంచు కాలనీకి చెందిన మేకల రత్నాకర్(23) దుర్మరణం చెందాడు. వివరాలిలా ఉన్నాయి. డిసెంబర్ 31 కావడంతో అందరూ కొత్త సంవత్సరం వేడుకలకు సిద్ధమవుతున్నారు. తన ఇంట్లో ఈ వేడుకలు జరపాలనుకున్నాడు రత్నాకర్. ఈ విషయాన్ని ఇంట్లో వారితో కూడా సాయంత్రం సమయంలో చర్చించాడు.
అప్పటిదాకా ఇంట్లో వారితో ఆనందంగా గడిపాడు. రాత్రి 12 గంటల సమయంలో స్వీట్లు పంచిపెట్టి బంధువుల నోరు తీపి చేయాలని భావించాడు. అనుకున్నదే తడవుగా స్వీట్లు కొనేందుకు తన మోటార్ సైకిల్పై ఇంటి నుంచి బయల్దేరాడు. మందమర్రి పాత బస్టాండ్ ప్రాంతానికి చేరుకున్నాడు. స్వీట్ షాపు అవతలి పక్కన ఉండడంతో రోడ్డు క్రాస్ చేసేందుకు ముందుకు కదిలాడు. ఓ క్షణంలోనే బెల్లంపల్లి నుంచి వస్తున్న లారీ వేగంగా ఢీకొంది. అంతేకాక వాహనం అతడి పైనుంచి వెళ్లడంతో శరీరం నడుము కింది భాగం అంతా కూడా నుజ్జునుజ్జయింది. దీంతో అక్కడిక్కడే మృతిచెందాడు. విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తూ సంఘటన స్థలానికి చేరుకున్నారు.
కట్టలు తెంచుకున్న బంధువుల కోపాగ్ని
చిధ్రమైన రత్నాకర్ మృతదేహాన్ని చూడగానే కుటుంబ సభ్యుల కోపం కట్టలు తెంచుకుంది. ప్రమాదానికి కారణమైన లారీపై రాళ్లతో దాడికి దిగారు. అద్దాలు ధ్వసం చేశారు. అంతటితో ఆగకుండా లారీకి నిప్పంటించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వారిని అదుపు చేయడం పోలీసులతో కూడా కాలేదు. పట్టణ సీఐ రఘునందన్, ఎస్సై రాజేందర్, ఎంత నచ్చజెప్పినా మృతుడి కుటుంబ సభ్యులు వినలేదు. రెండు గంటల పాటు బస్టాండ్ ప్రాంతం రణరంగంగా మారింది. రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. చివరకు నష్ట పరిహారం ఇప్పిస్తామని మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా, రత్నాకర్కు ఏడాది క్రి తమే వివాహమైంది. ఈ ఘటనతో అతడి కుటుంబం కొత్త సంవత్సరం వేళ విషాద సంద్రంలో మునిగింది.