వివాహేతర సంబంధం కారణంగానే.. | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం కారణంగానే..

Published Mon, Nov 30 2015 5:00 PM

Lovers commit suicide

పెనుగంచిప్రోలు (కృష్ణా జిల్లా) : భర్త, పిల్లలను వదిలి ప్రియుడితో కలిసి మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన వివాహిత ప్రియుడితో పాటు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరూ మృతిచెందారు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముల్లపాడు గ్రామంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

కంచికచర్ల మండలం మోగులూరు గ్రామానికి చెందిన సుజాత(26)కు జగ్గయ్యపేట మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన నాగేశ్వర్‌రావు(30)తో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య, భర్త తాపీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా సుజాత అదే గ్రామానికి చెందిన నాగవేణు(20)తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. కాగా.. మూడు రోజుల క్రితం సుజాత భర్త, పిల్లలను వదిలేసి నాగవేణుతో వెళ్లిపోయింది.

దీంతో కుటుంబసభ్యులు కంచికచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు వారి ఆచూకీ కోసం వెతుకుతుండగా.. పెనుగంచిప్రోలు మండలం ముల్లపాడు గ్రామ శివారులోని సుబాబుల్ తోటల్లో ప్రాణాపాయస్థితిలో ఉన్నట్లు గుర్తించారు. అయితే అక్కడికి చేరుకునేలోపే సుజాత మృతిచెందగా.. నాగవేణు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా.. మార్గమధ్యంలో మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement