-
పొత్తుపై కాంగ్రెస్కు టీఆర్ఎస్ ప్రతిపాదన
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్-టీఆర్ఎస్ పార్టీల పొత్తుకు ముఖ్యమంత్రి పదవి ప్రధాన అడ్డంకిగా మారినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు... ఎన్నికల అనంతరం అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి తమకే ఇవ్వాలని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు షరతు విధిస్తున్నారు. అంతేగాకుండా ఆ విషయాన్ని ఎన్నికలకు ముందే బహిరంగంగా ప్రకటించాలని కూడా ఒత్తిడి తెస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు మాత్రం ఈ విషయంలో విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిని ప్రకటించే సంస్కృతి కాంగ్రెస్కు లేదని చెబుతున్నారు. కాంగ్రెస్ చరిత్రలో ఏ ఎన్నికల్లోనూ ఇంతవరకు అధికారికంగా సీఎం అభ్యర్థిని ప్రకటించలేదని గుర్తుచేస్తున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఇరు పార్టీలకు వచ్చే సీట్లు, ఓట్ల ఆధారంగా సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు.
తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్-టీఆర్ఎస్లకు 64-55 సీట్ల చొప్పున పంచుకుందామని కాంగ్రెస్ పెద్దలు ప్రతిపాదించారు. వీటిలో ప్రస్తుతమున్న సిట్టింగ్ స్థానాలన్నింట్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులే పోటీ చేస్తారని స్పష్టం చేశారు. అదేవిధంగా టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలన్నీ ఆ పార్టీకే వదిలేస్తామని ప్రతిపాదించారు. మిగిలిన సీట్లలో ఏ పార్టీ గెలిచే అవకాశాలున్నాయో, ఏ పార్టీ అభ్యర్థి బలంగా ఉన్నారో గుర్తించి పంచుకుందామని సూచించారు.
కాంగ్రెస్ పెద్దల ప్రతిపాదన మేరకు ప్రస్తుతం తెలంగాణలో 48 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు చెందిన వారున్నారు. వీరితోపాటు కుత్బుల్లాపూర్కు చెందిన స్వతంత్ర అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్ కాంగ్రెస్ అనుబంధ సభ్యుడిగా ఉన్నారు. టీఆర్ఎస్కు చెందిన మంచిర్యాల ఎమ్మెల్యే అరవింద్రెడ్డి ఇటీవల కాంగ్రెస్లో చేరారు. పొత్తు కుదిరితే మొత్తం 50 సిట్టింగ్ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోకి వెళతాయి.
సిట్టింగ్ స్థానాలతోపాటు అదనంగా మరో 14 స్థానాల ను కాంగ్రెస్ కోరుతోంది. వాటిలో నిజామాబాద్ జిల్లాలో మూడు (నిజామాబాద్ పట్టణ, గ్రామీణ నియోజకవర్గాలతోపాటు ఆర్మూరు), కరీంనగర్లో రెండు (జగిత్యాల, పెద్దపల్లి), గ్రేటర్ హైదరాబాద్లో మూడు (రాజేంద్రనగర్, అంబర్పేట, కూకట్పల్లి), మహబూబ్నగర్లో రెండు (వనపర్తి, కల్వకుర్తి), ఖమ్మంలో రెండు (సత్తుపల్లి, కొత్తగూడెం), వరంగల్, నల్లగొండ జిల్లాల్లో ఒక్కో నియోజకవర్గాన్ని (పాలకుర్తి, మునుగోడు) కాంగ్రెస్కు కేటాయించాలని కోరుతున్నారు.
సిట్టింగ్ ఎంపీ స్థానాలన్నీ కాంగ్రెస్కే
అలాగే ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ స్థానాలన్నీ తమకే కేటాయించాలని కాంగ్రెస్ నేతలు ప్రతిపాదించారు. నాగర్కర్నూలు, పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీలు మందా జగన్నాథం, జి.వివేక్ టీఆర్ఎస్లోకి వెళ్లినందున ఆ స్థానాలకు బదులుగా ఖమ్మం, మెదక్ స్థానాలకు తమకు కేటాయించాలని కోరారు. మెదక్ సిట్టింగ్ ఎంపీ విజయశాంతి ప్రస్తుతం కాంగ్రెస్లో చేరినందున ఆ స్థానాన్ని కచ్చితంగా తమకు ఇవ్వాల్సిందేనని చెబుతున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంపీ స్థానాల విషయంలో కాంగ్రెస్ ప్రతిపాదనపట్ల సుముఖంగా ఉన్నప్పటికీ ఎమ్మెల్యే సీట్ల విషయంలో మాత్రం చెరో సగం పంచుకోవాల్సిందేనని పట్టుపడుతున్నారు. వీట న్నింటికంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవిని కూడా టీఆర్ఎస్కు ఇవ్వాలని షరతు విధిస్తున్నారు. అలాచేస్తే మరికొన్ని అసెంబ్లీ, లోక్సభ స్థానాలను వదులుకునేందుకు కూడా సిద్ధమేనని ప్రతిపాదిస్తున్నట్టు సమాచారం.
- కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావాలంటే తెలంగాణ లోక్సభ సీట్లు చాలా కీలకమైనవైనందున అభ్యర్థుల ఖరారుపై జాగ్రత్త వహించాలని కేసీఆర్ సూచిస్తున్నారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న కాంగ్రెస్ నేతల్లో సగం మంది ఓడిపోతారని తన సర్వేల్లో తేలిందని, వారి స్థానాల్లో వేరేవారిని కాంగ్రెస్ అభ్యర్థులుగా నియమించుకోవాలని సూచించారు. నిజామాబాద్, వరంగల్, మల్కాజ్గిరి వంటి స్థానాలు ఓడిపోయే ఖాతాలో ఉన్నాయని చెప్పారు.
- కేసీఆర్ సూచనలను హైకమాండ్ పెద్దలు పట్టించుకోలేదు. సిట్టింగ్ స్థానాల్లో ఎవరిని మార్చాలి? మరెవరిని కొనసాగించాలనేది తమ పార్టీ అంతర్గత వ్యవహారమని తేల్చిచెప్పారు. సీఎం పదవి విషయంలోనూ పట్టుపట్టవద్దని, అది ఆచరణ సాధ్యంకాదని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం టీఆర్ఎస్కు మెజారిటీ సీట్లు వస్తే ముఖ్యమంత్రి పదవి విషయంలో అభ్యంతరం లేదని చెప్పినట్టు తెలిసింది.
- కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్పటేల్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్సింగ్, కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్, ఏఐసీసీ రాష్ట్ర ఎన్నికల స్రీనింగ్ కమిటీ సభ్యుడు వయలార్ రవి టీఆర్ఎస్ నేతలతో అంతర్గతంగా చర్చలను కొనసాగిస్తున్నారు. అయితే చర్చల ప్రక్రియ మాత్రం ఇంకా కొలిక్కి రాకపోవడం, సీఎం పదవి తనకే ఇవ్వాలని కేసీఆర్ పట్టుపడుతుండటంతో పొత్తు ఖరారు బాధ్యతను హైకమాండ్ పెద్దలు దిగ్విజయ్సింగ్కు అప్పగించారు.
- ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న దిగ్విజయ్సింగ్ సోమవారం సాయంత్రమే కేసీఆర్తో భేటీ అవుతారని పార్టీలో ప్రచారం జరిగినా ఇప్పటివరకు ఆ సమావేశం జరగలేదు. ఏదేమైనా రాష్ట్ర పర్యటన ముగిసేలోపు గులాబీ నేతలతో సమావేశమై పొత్తుపై ఒక స్పష్టతకు రావాలని, అనంతరం ఢిల్లీవెళ్లి పొత్తుల సారాంశం, టీఆర్ఎస్ ప్రతిపాదనలతో ఒక నివేదికను రూపొందించి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ముందుంచాలని దిగ్విజయ్సింగ్ నిర్ణయించారు.
పొత్తు కష్టమేనంటున్న టి.కాంగ్రెస్ నేతలు
మరోవైపు టీఆర్ఎస్ పొత్తు ఆచరణ సాధ్యమయ్యేలా కన్పించడం లేదని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ ప్రతిపాదనలను అంగీకరించడం సాధ్యంకాదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నారు. టీఆర్ఎస్లో కేసీఆర్ ఒక్కడే సీఎం అభ్యర్థిగా ఉన్నారని, అదే కాంగ్రెస్లో ఏడెనిమిదిమంది నేతలు సీఎం సీటు కోసం సీరియస్గా ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. తాజా పరిణామాలను పరిశీలిస్తే టీఆర్ఎస్తో పొత్తు కుదిరేలా లేదని అభిప్రాయపడుతున్నారు.