
కదిరి ఎమ్మెల్యేకు అన్నీ అవమానాలే !
కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్బాషా తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుంచి అన్ని చోట్లా ఆయనకు అవమానాలే...
► మహా సంకల్ప సభకు ముఖ్యఅతిథిగా కందికుంట
► దమ్ముంటే ఎమ్మెల్యే హాజరు కావాలని కందికుంట అనుచరుల సవాల్
కదిరి : కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్బాషా తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుంచి అన్ని చోట్లా ఆయనకు అవమానాలే ఎదురవుతున్నాయి. నియోజకవర్గంలోనే కాదు ఆయన ఎక్కడికెళ్లినా ఎమ్మెల్యే అన్న కనీస గౌరవం కూడా దక్కడం లేదు. మొన్న కదిరిలో జరిగిన నియోజకవర్గ టీడీపీ మినీ మహానాడు సభకు కనీసం ఆహ్వానం కూడా లేదు. తాజాగా బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా అధికారికంగా జరిగిన మహా సంకల్ప సభకు కూడా పిలుపు లేదు. ఈ రెండు సమావేశాలకూ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్నే ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.
ఒక వేళ ఈ రెండు సమావేశాలకు ఎమ్మెల్యే హోదాలో చాంద్బాషా హాజరైనట్లైతే ఆయనకు కందికుంట అనుచరుల నుంచి తీవ్ర అవమానం జరిగేదని ఆ పార్టీ నాయకులే బహిరంగంగా చెబుతున్నారు. రెండు రోజుల క్రితం ఎమ్మెల్యేకు సంబంధించిన అత్తార్ రెసిడెన్సీ ముందు సీపీఎం ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీ సదస్సు జరిగింది. ఆ సదస్సుకు ఎమ్మెల్యే అత్తార్కు ఆహ్వానం లేకపోయినా వెళ్లి వేదికపై ఆశీనులయ్యారు.
అయితే వేదికపైనున్న సీపీఎం నాయకులు ఎమ్మెల్యేనుద్దేశించి ‘కొందరు నాయకులు విలువలకు తిలోదకాలిచ్చి సంతలో పశువులకు కన్నా హీనంగా డబ్బుకు అమ్ముడు పోతున్నారు’ అని పదే పదే చెప్పడంతో ఆయన ప్రసంగించకుండానే మెల్లగా జారుకున్నారు. ఇలాంటి అవమానాలే ఆయనకు జిల్లా కేంద్రంతో పాటు కళ్యాణదుర్గంలో జరిగిన పార్టీ సమావేశాల్లో కూడా ఎదురయ్యాయి. ఒక పార్టీ తర ఫున గెలిచి ఆ పదవికి రాజీనామా చేయకుండా వేరే పార్టీ కండువా కప్పుకున్న నాయకులకు ఇలాంటి అవమానాలే ఎదురు కావాలని ప్రజలు అంటున్నారు.