జగన్‌తోనే పేదల సంక్షేమం | Jagan poor welfare | Sakshi
Sakshi News home page

జగన్‌తోనే పేదల సంక్షేమం

Mar 13 2014 1:37 AM | Updated on Aug 17 2018 8:19 PM

జగన్‌తోనే   పేదల సంక్షేమం - Sakshi

జగన్‌తోనే పేదల సంక్షేమం

వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డితోనే పేదల సంక్షేమం సాధ్యమని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

 వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డితోనే పేదల సంక్షేమం సాధ్యమని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పుత్తూరు మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డి.ఎన్.ఏలుమలై బుధవారం వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా పుత్తూరులో నిర్వహించిన కార్యక్రమానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఆయన మాట్లాడుతూ వై.ఎస్.రాజశేఖర రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు తిరిగి అమలు కావాలంటే  ప్రజలు ఫ్యాను గుర్తుకు ఓట్లేసి జగన్‌మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. ‘పుత్తూరు మండలంలో అందరికీ అందుబాటులో ఉండే నాయకుడు ఏలుమలై అని, తాను కాంగ్రెస్‌లో ఉన్నప్పటి నుంచి ఏలుమలై తెలుసునని, మీరు పిలిచినట్లే తానూ అమ్ములు అనే పిలుస్తానని’ పెద్దిరెడ్డి అన్నారు. అమ్ములు రాకతో పుత్తూరులో వైఎస్‌ఆర్ సీపీకి తిరుగు ఉండదన్నారు.

త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటువేసి అమ్ములును పుత్తూరు మున్సిపల్ చైర్మన్‌గా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే నగరి ఎమ్మెల్యేగా ఆర్‌కె.రోజాను గెలిపించుకోవాలన్నారు. ఇంకా కొందరు కాంగ్రెస్ నాయకులు ఆలోచిస్తూనే ఉన్నారని, రెండో ఆలోచన లేకుండా వైఎస్‌ఆర్ సీపీలో చేరాలని సూచించారు. అంతకుముందు ఏలుమలైకి పార్టీ కండువా వేసి వైఎస్‌ఆర్ సీపీలోకి ఆహ్వానించారు. ఏలుమలై, పలువురు కాంగ్రెస్ నాయకులు పార్టీలో చేరారు.
 

 రోజానే గొప్ప: నారాయణస్వామి
 

మనిషిపోతే రూ.500 ఇచ్చి ఆర్థిక సాయం చేశా నంటూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకునే ముద్దుకృష్ణమనాయుడు గొప్పవారా? 300 మంది అనాథలకు ప్రతినెలా రూ.300 వంతున సొంతంగా పింఛన్ అందిస్తున్న రోజా గొప్పవారా అంటూ పుత్తూరు ప్రజలను వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి ప్రశ్నించారు. రోజానే అంటూ జనం హర్షధ్వానాల మధ్య సమాధానమిచ్చారు. పేదలతో కలిసిమెలసి తిరిగే వ్యక్తి ఏలుమలై అని, అలాంటి వ్యక్తి వైఎస్‌ఆర్ సీపీలో చేరడం పుత్తూరు ప్రజలకు ఎంతో శుభపరిణామమని అన్నారు.
 

కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధి చెప్పండి: రోజా

 రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌కు, దానికి వత్తాసు పలికిన టీడీపీకి ఓటు ద్వారా ప్రజలు బుద్ధి చెప్పాలని వైఎస్‌ఆర్ సీపీ కేంద్ర కార్య నిర్వాహక మండలి సభ్యురాలు,నగరి నియోజకవర్గ ఇన్‌చార్జి ఆర్‌కె.రోజా పిలుపునిచ్చారు. మున్సిపల్, స్థానిక ఎన్నికల్లో వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
 

 అర్ధరాత్రి పిలిచినా పలుకుతా: ఏలుమలై
 

తనను 30 ఏళ్లుగా ఆదరిస్తున్న పుత్తూరు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఏలుమలై స్పష్టం చేశారు. ఈ రోజు మీ అందరి ఆమోదంతోనే తాను వైఎస్‌ఆర్ సీపీలో చేరానని చెప్పారు. తాను చేపట్టిన మూలకోన ప్రాజెక్టు పనులకు ఇక్కడి నాయకులు కొందరు తీవ్ర ఆటంకాలు సృష్టించారన్నారు. అయితే పట్టుదలతో ఆ పనిని పూర్తి చేయడంతో నేడు మూలకోన నీటినే పుత్తూరు ప్రజలు తాగుతున్నారని గుర్తు చేశారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని ప్రతి ఒక్కరూ బల పరచాలని కోరారు. ఏలుమలై, స్థానిక ఓంశక్తిలారీ సర్వీస్ యజమాని డి.మహేంద్రన్, డీసీసీబీ డెరైక్టర్ దిలీప్‌రెడ్డి, మాజీ సర్పంచ్ రవిశేఖర్‌రాజు, ప్రముఖ శల్యవైద్యులు కృష్ణంరాజు, మాజీ కౌన్సిలర్లు నారాయణబాబు, శంకర్, చెర్లోపల్లె సింగిల్‌విండో అధ్యక్షు లు లక్ష్మీపతి, నాయకులు ఎం.బాబురావ్‌గౌడ్, ఎం శ్రీనివాసులు, ప్రతాప్, మాహీన్, సంపత్, పెద్ద సంఖ్యలో అనుచరులు వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు.

ఈ కార్యక్రమంలో తిరుపతి పట్టణ పార్టీ అధ్యక్షులు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, జిల్లా రైతు సేవా సంఘం అధ్యక్షులు ఆదికేశవరెడ్డి, సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం, జిల్లా కార్మికవర్గ కన్వీనర్ బీరేంద్ర వర్మ, రోజా భర్త ఆర్‌కె.సెల్వమణి, పోకల అశోక్‌కుమార్, నగరి మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే.కుమార్, వైఎస్‌ఆర్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఎం.సురేంద్రరాజు, భారీ సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement