గౌరవ డాక్టరేట్‌ అందుకున్న ఇస్రో చైర్మన్‌ 

ISRO Chairman received the Honorary Doctorate - Sakshi

గౌరవ డాక్టరేట్‌ అందుకున్న ఇస్రో చైర్మన్‌ 

65 మందికి బంగారు పతకాలు.. 1,128 మందికి డిగ్రీ ప్రదానం 

యూనివర్సిటీ క్యాంపస్‌ (తిరుపతి): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్‌ కె.శివన్‌ తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ అందుకున్నారు. శనివారం శ్రీనివాస ఆడిటోరియం లో నిర్వహించిన 55వ స్నాతకోత్సవంలో వీసీ ప్రొఫెసర్‌ ఎ.దామోదరం చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ స్నాతకోత్సవానికి రావాల్సిన వర్సిటీ చాన్స్‌లర్, గవర్నర్‌ నరసింహన్‌ హాజరుకా లేదు. 1,128 మందికి వివిధ రకాల డిగ్రీలను, 65 మంది బంగారు పతకాలను ప్రదానం చేశారు. ముఖ్య అతిథిగా వచ్చిన శివన్‌ స్నాతకోపన్యాసం చేస్తూ మానవాళి ప్రయోజనాల కోసం ఇస్రో అనేక ప్రయోగాలు చేస్తోందన్నారు.

ప్రస్తుతం శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపటానికి లాంచ్‌ వెహికల్స్‌ను విజయవంతంగా ప్రయోగిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో ఎక్కువ బరువైన లాంచ్‌ వెహికల్స్‌ను అంతరిక్షంలోకి పంపటానికి సిద్ధం చేస్తున్నామన్నారు. కమ్యూనికేషన్‌ శాటిలైట్ల వల్ల టెలికమ్యూనికేషన్, టెలి ఎడ్యుకేషన్, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్, ఏటీఎంల నిర్వహణతో పాటు ప్రకృతి విపత్తులను గుర్తించే సాంకేతిక వ్యవస్థ అందుబాటులోకి వచ్చిందన్నారు. ‘గగన్‌’ను దేశంలోని 50 ఎయిర్‌పోర్ట్‌లలోకి అందుబాటులోకి తెచ్చామన్నారు. దీనివల్ల విమానాలను సురక్షితంగా ల్యాండ్‌ చేయవచ్చన్నారు. దీన్ని రైల్వేలోకి కూడా అందుబాటులోకి  తేవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. దీంతో మానవ రహిత రైల్వే క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలను నివారించవచ్చన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top