డా నాంగ్ (వియత్నాం): కుస్తీ క్రీడలో మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకున్న భారత మల్లయోధులు ఆసియా అండర్–23 చాంపియన్షిప్ ఫ్రీస్టయిల్ విభాగంలో ఓవరాల్ టైటిల్ను సొంతం చేసుకున్నారు. మంగళవారం ముగిసిన ఈ పోటీల్లో భారత్ 180 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. చివరిరోజు భారత్ ఖాతాలో ఏడు పతకాలు చేరాయి.
మోహిత్ కుమార్ (65 కేజీలు), చందర్మోహన్ (79 కేజీలు) స్వర్ణ పతకాలు నెగ్గారు. పునీత్ కుమార్ (92 కేజీలు), దీపక్ (61 కేజీలు), లక్కీ (125 కేజీలు) రజత పతకాలు కైవసం చేసుకున్నారు. దీపక్ (74 కేజీలు), సచిన్ మోర్ (86 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు.
ఫైనల్స్లో మోహిత్ 12–4తో అబ్దిసమతోవ్ (కిర్గిస్తాన్)పై, చందర్మోహన్ 7–6తో అబిల్ యెర్ఖాన్ (కజకిస్తాన్)పై గెలుపొందారు. మిగతా టైటిల్ బౌట్లలో పునీత్ కుమార్ 1–12తో ఉలుక్బెక్ సురోమ్బెకోవ్ (కిర్గిస్తాన్) చేతిలో, దీపక్ 1–3తో నుర్దానత్ ఐతనోవ్ (కజకిస్తాన్) చేతిలో, లక్కీ 0–10తో రిజాబెక్ ఐత్ముఖాన్ (కజకిస్తాన్) చేతిలో ఓటమి పాలయ్యారు.
కాంస్య పతక బౌట్లలో దీపక్ 10–0తో వతన్ అన్నావోరజోవ్ (తుర్క్మెనిస్తాన్)పై, సచిన్ మోర్ 4–1తో రుజుమ్బొయెవ్ (ఉజ్బెకిస్తాన్)పై విజయం సాధించారు.


