ఉమ్మడి విధానంలో ఇంటర్ పరీక్షలు: గంటా | Inter exams to start from 11th March, says ganta srinivasa rao | Sakshi
Sakshi News home page

ఉమ్మడి విధానంలో ఇంటర్ పరీక్షలు: గంటా

Nov 13 2014 12:22 PM | Updated on Aug 11 2018 7:33 PM

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు(ఐపీఈ-2014) వచ్చే మార్చి 11నుంచి నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.

హైదరాబాద్ : ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు(ఐపీఈ-2014) వచ్చే మార్చి 11నుంచి నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆయన గురువారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను తెలంగాణ ప్రభుత్వానికి పంపించినట్లు చెప్పారు. ఉమ్మడి విధానంలోనే ఇంటర్ పరీక్షలు జరుగుతాయని, ఇందుకు తెలంగాణ సర్కార్ సహకరించాలని కోరుతున్నట్లు తెలిపారు.

 డీఎస్సీపై కేంద్రం అడిగిన డేటా పంపించామని, బీఈడీ అభ్యర్థులకు, ఎన్జీటీ పోస్టులకు అవకాశం కల్పించడం కష్టమంటున్నారని గంటా శ్రీనివాసరావు తెలిపారు. కేంద్రం పూర్తిస్థాయి నిర్ణయం ప్రకటించాక డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలు చేస్తామన్నారు. కేంద్ర విద్యాసంస్థలకు స్థలాలు ఖరారు చేస్తామని, ఐఐటీ, ఐఎస్ఈఏఆర్లను చిత్తూరు జిల్లా ఏర్పేడులో ఏర్పాటు చేస్తామని గంటా తెలిపారు.

ఐఏఎమ్ విశాఖ జిల్లాలోని గంభీరంలో, ఎన్ఐటీ తాడేపల్లి గూడెంలో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. గిరిజన యూనివర్శిటీ ఏర్పాటుకు విజయనగరం జిల్లాలో స్థలం సానుకూలంగా లేదని కేంద్రం తిరస్కరించిందన్నారు. విశాఖ జిల్లా సబ్బవరం స్థలాన్ని పరిశీలిస్తున్నామని, ట్రిపుల్ ఐటీ, సెంట్రల్ యూనివర్శిటీలకు ఇంకా స్థలాలు ఖరారు కాలేదన్నారు. రాష్ట్రంలో 8,601 పాఠశాలల్లో టాయిలెట్స్ నిర్మాణానికి 10 ప్రభుత్వ రంగ సంస్థలు ముందుకొచ్చాయన్నారు. రూసా పథకం కింద రూ.1747 కోట్లతో విద్యాసంస్థలను అభివృద్ధి చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement