విద్యార్థులకు ఉమ్మడి పరీక్షలు
1 నుంచి 10 తరగతులకు సమ్మేటివ్–1 ఎగ్జామ్స్
21 నుంచి ప్రారంభం
23 నుంచి మూల్యాంకనం
ఆన్లైన్లో మార్కుల జాబితాలు
రాయవరం / రాజమహేంద్రవరం రూరల్ :
ఈ ఏడాది నుంచి విద్యా శాఖ నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తోంది. దీని ప్రకారం ఒకటి నుంచి 10వ తరగతి వరకూ ఉమ్మడి పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 21 నుంచి సమ్మేటివ్–1 (క్వార్టర్లీ) పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఆరు నుంచి పదో తరగతి వరకూ 4,03,860 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. అన్ని యాజమాన్యాల పరిధిలోని తెలుగు, ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కావాలి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రకటించిన తేదీ, సమయానికి ప్రభుత్వం అందించే ప్రశ్నపత్రాలతోనే ఈ పరీక్షలు నిర్వహించాలని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
జంబ్లింగ్ విధానంలో..
ఈ ఏడాది నుంచి జంబ్లింగ్ విధానంలో విద్యార్థుల ప్రశ్నపత్రాలను మూల్యాంకనం చేయనున్నారు. ఆయా మండలాల్లో మూల్యాంకన కేంద్రాలు (స్పాట్ వేల్యుయేషన్) ఏర్పాటు చేసి పక్క మండలాల విద్యార్థుల జవాబు పత్రాలు దిద్దనున్నారు. ఈ నెల 23 నుంచి అక్టోబరు 3వ తేదీ వరకూ మూల్యాంకనం చేసి అక్టోబరు 11 నుంచి 25వ తేదీ లోపు విద్యార్థుల మార్కులను ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులు ఆదేశించారు. తద్వారా విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేయడానికి, ఏ సబ్జెక్టులో వెనుకబడ్డారో గుర్తించి, అందులో రాణించేలా చేయడానికి వీలు కలుగుతుందని పేర్కొన్నారు.
జంబ్లింగ్ పద్ధతిని వ్యతిరేకిస్తున్నాం
బాలాజీచెరువు (కాకినాడ) : సమ్మెటివ్ పరీక్షల మూల్యాంకనంలో జంబ్లింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్టు యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.కామేశ్వరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఆన్లైన్ పేరిట ఉపాధ్యాయులను బోధనకు దూరం చేస్తున్నారని, ఇప్పుడు ఈ నూతన సంస్కరణల పేరుతో మరింత గందరగోళానికి గురి చేస్తున్నారని అన్నారు.
ఇదీ పరీక్షల షెడ్యూల్..
ఈ నెల 21 నుంచి 28వ తేదీ వరకూ ఆరు నుంచి పదో తరగతి వరకూ విద్యార్థులకు సమ్మేటివ్–1 పరీక్షలను ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకూ రెండు విడతలుగా నిర్వహించనున్నారు. 21వ తేదీన 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ఓరియంటల్ లాంగ్వేజెస్, ఒకేషనల్ కోర్సులకు పరీక్ష జరుగుతుంది.
6వ తరగతి : ఈ విద్యార్థులకు ఉదయం మాత్రమే పరీక్ష జరుగుతుంది. 22వ తేదీన తెలుగు (భాషలు), 23న హిందీ, 24న ఇంగ్లిష్, 26న గణితం, 27న సైన్స్, 28న సోషల్ సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహిస్తారు.
7వ తరగతి : 22వ తేదీ ఉదయం తెలుగు, మధ్యాహ్నం తెలుగు / సంస్కృతం / ఉర్దూ మినహా మిగిలిన పరీక్షలను నిర్వహిస్తారు. 23న హిందీ, 24న ఇంగ్లిష్, 26న గణితం, 27న సైన్స్, 28న సోషల్ పరీక్షలు జరుగుతాయి.
8వ తరగతి : 22 ఉదయం తెలుగు / ఉర్దూ / సంస్కృతం, మధ్యాహ్నం సంస్కృతం పరీక్షలు జరుగుతాయి. 23 ఉదయం హిందీ, 24 ఉదయం ఇంగ్లిష్, 26 ఉదయం గణితం, 27 ఉదయం ఫిజికల్ సైన్స్, మధ్యాహ్నం బయలాజికల్ సైన్స్, 28 ఉదయం సోషల్ పరీక్షలు నిర్వహిస్తారు.
9, 10 తరగతులు : 22వ తేదీ ఉదయం, మధ్యాహ్నం తెలుగు/ఉర్దూ/సంస్కృతం, 23 ఉదయం హిందీ, 24 ఉదయం ఇంగ్లిష్–1, మధ్యాహ్నం ఇంగ్లిష్–2, 26 ఉదయం గణితం–1, మధ్యాహ్నం గణితం–2, 27 ఉదయం ఫిజికల్ సైన్స్, మధ్యాహ్నం బయలాజికల్ సైన్స్, 28 ఉదయం సోషల్–1, మధ్యాహ్నం సోషల్–2 పరీక్షలు జరుగుతాయి.
24 నుంచి ప్రాథమిక స్థాయి విద్యార్థులకు..
ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పరీక్షలు నిర్వహించనున్నారు. 24న తెలుగు, 26న ఇంగ్లిష్, 27న గణితం, 28న పరిసరాల విజ్ఞానం సబ్జెక్టుల్లో పరీక్షలు నిర్వహిస్తారు.