హామీల అమలుకు ఎదురుతెన్నులు | In Rare Speech, Sonia Gandhi Accuses Government of Andhra Pradesh Apathy | Sakshi
Sakshi News home page

హామీల అమలుకు ఎదురుతెన్నులు

Mar 18 2015 1:00 AM | Updated on Oct 22 2018 9:16 PM

హామీల అమలుకు ఎదురుతెన్నులు - Sakshi

హామీల అమలుకు ఎదురుతెన్నులు

ఏపీ శాసనమండలిలో ప్రస్తుతం ఉన్న సభ్యుల సంఖ్యను 50 నుంచి 58కి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన...

లోక్‌సభలో ఏపీ తరఫున సోనియాగాంధీ వకాల్తా
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ శాసనమండలిలో ప్రస్తుతం ఉన్న సభ్యుల సంఖ్యను 50 నుంచి 58కి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు-2015ను లోక్‌సభ మంగళవారం ఆమోదించింది. దీనిపై సభలో మూడు గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. బిల్లుపై ముందుగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ మాట్లాడారు.కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత సోనియా లోక్‌సభలో తొలిసారి, అదీ ఆంధ్రప్రదేశ్ అంశంపై మాట్లాడారు.

‘ఈ బిల్లును స్వాగతిస్తున్నాం. కానీ విభజన చట్టంలో పొందుపరచిన హామీలను నెరవేర్చడానికి కేంద్రం ఇంతే అత్యవసరంగా ఎందుకు కృషిచేయడం లేదో ఆశ్చర్యంగా ఉంది. ఈ హామీలను నెరవేరుస్తారని ఏపీ ప్రజలు 9 నెలలుగా సహనంతో ఎదురుచూస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం సుదీర్ఘకాలంగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో.. యూపీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజిస్తూనే ఏపీ ప్రయోజనాలను కాపాడే విషయంలోనూ చిత్తశుద్ధిని ప్రదర్శించింది.

ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన అన్ని అంశాలను నాటి బిల్లులో పొందుపరిచింది. అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందేవేళ ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించారు. ఆ తర్వాత మంత్రివ ర్గ సమావేశం (మార్చి 3, 2014) కూడా స్పెషల్ స్టేటస్‌కు ఆమోదం తెలిపింది. విభజన చట్టంలో పారిశ్రామిక ప్రగతికి పన్ను ప్రోత్సాహకాలను పొందుపరిచింది. రెవెన్యూ లోటును భర్తీ చేసేందుకు నిబంధనను పొందుపరిచాం. కానీ ప్రత్యేక హోదా హామీని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చడం లేదు.

14వ ఆర్థిక సంఘం పూర్తిస్థాయిలో ఏపీకి న్యాయం చేయలేకపోయింది. ఆ రాష్ట్రం ఇప్పుడు భారీగా రెవెన్యూ లోటును ఎదుర్కొంటోంది. ఏపీకి కీలకమైన పోలవరం ప్రాజెక్టును అత్యవసరంగా నిర్మించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ఇదివరకే ప్రకటించాం. అందువల్ల వెంటనే పూర్తిచేయాలి. అలాగే అన్ని రాష్ట్రాల్లాగే ఏపీకి కూడా రాజధాని ఉండాలి.

అందుకు కేంద్రం సాయం చేయాలి. కానీ ఈ దిశగా ఏ చర్యలూ తీసుకోలేదు. ఏపీకి రైల్వే జోన్ ఏర్పాటు, వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్, వైఎస్సార్ జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ, పెట్రో కెమికల్ రిఫైనరీ, పెట్రోలియం వర్శిటీ, దుగిరాజపట్నం పోర్టు అభివృద్ధి వంటి హామీలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. ఈ విషయాలన్నింటిపై నేను ఇదివరకే ప్రధానమంత్రికి రెండుసార్లు లేఖ రాశాను. ఈ విషయాలను అత్యవసరంగా పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నా..’ అని అన్నారు.
 
ప్రత్యేక హోదా బిల్లులో లేదు..
ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ స్టేటస్ అంశం పునర్వ్య వస్థీకరణ బిల్లులో లేదని, ఎందుకు లేదో కాంగ్రెస్ సమాధానం చెప్పాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ‘9 సంవత్సరాల 9 నెలల 9 రోజుల తరువాత అయినా ఏపీ సమస్యలను గుర్తించి కాంగ్రెస్ అధ్యక్షురాలు మాట్లాడారు. చాలా సంతోషం’ అని ప్రసంగం మొదలుపెట్టగానే కాంగ్రెస్ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. తిరిగి వెంకయ్య ప్రసంగిస్తూ.. ‘2004లోనే మీరు సమస్యను పరిష్కరించి ఉంటే ఈ గొడవే ఉండేది కాదు.

మీకు పదేళ్లు పట్టింది. మేం కేవలం 9 నెలలు తీసుకున్నాం. నిన్న మొయిలీ మాట్లాడుతూ ఏపీ, తెలంగాణలకు పన్ను ప్రోత్సాహకాలు ప్రకటించడం సహేతుకం కాదన్నారు. ఇప్పుడేమో కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇలా అంటున్నారు...’ అని పేర్కొన్నారు. సోనియా జోక్యం చేసుకుని ‘మీరు కూడా స్పెషల్ స్టేటస్ కోసం అడిగారు కదా..’ అని గుర్తు చేశారు. వెంకయ్య మాట్లాడుతూ ‘అవును అడిగాను. అన్ని పార్టీలూ అడిగాయి. తెలంగాణ ఏర్పాటుకు అన్ని పార్టీలు సమ్మతించాయి. మేం మద్దతిచ్చాం. ఇప్పుడు కూడా అంతే చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం..’ అని అన్నారు.
 
సమగ్ర బిల్లు తెస్తాం..
రాజ్యసభ సభ్యుల సర్దుబాటు తదితర అంశాలన్నింటిపై ఇంకా సవరణలు చేయాల్సి ఉందంటూ.. అన్ని సమస్యల పరిష్కారంతో కూడిన సమగ్రమైన బిల్లు కోసం కొందరు సభ్యులు అడిగారని, దీనికి కొంత సమయం పడుతుందని వెంకయ్య చెప్పారు. బిల్లు ఆమోదం పొందేముందు మాట్లాడిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు కూడా.. పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్న లోపాలన్నింటినీ సవరించేందుకు సమగ్ర బిల్లును తీసుకొస్తామని హామీ ఇచ్చారు.  

శాసనమండలి సభ్యుల సంఖ్య 40కి తగ్గకుండా.. శాసనసభ్యుల సంఖ్యలో మూడో వంతుకు మించకుండా ఉండాలని, దానికి అనుగుణంగానే ఈ బిల్లును సవరిస్తున్నామని చెప్పారు. అన్ని పార్టీల సభ్యులు దాదాపు 20 మంది సుదీర్ఘంగా ఏపీ, తెలంగాణ సమస్యలను ప్రస్తావించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కొంతమంది టీడీపీ సభ్యులు ఆనాడు నినాదాలు చేశారని, ఇప్పుడేమో విభజనను కోరుకున్న బీజేపీతో కలిసి ప్రభుత్వంలో ఉన్నారని టీఎంసీ నేత సౌగతరాయ్ వ్యాఖ్యానించారు. టీడీపీ లోక్‌సభ పక్ష నేత తోట నర్సింహంతో పాటు ఆ పార్టీ ఎంపీలు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, నిమ్మల కిష్టప్ప, టీఆర్‌ఎస్ ఎంపీలు బి.వినోద్, బూర నర్సయ్య గౌడ్, కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు తదితరులు మాట్లాడారు.
 
పెరిగిన 8 స్థానాల్లో ఎవరికి ఎన్ని?
ఏపీ శాసన మండలి స్థానాల సంఖ్యను 50 నుంచి 58కి పెంచుతూ కేంద్రం తెచ్చిన బిల్లుపై కిరెన్ రిజిజు సమాధానమిస్తూ.. ఈ పెరిగిన 8 స్థానాల్లో మూడు అసెంబ్లీ సభ్యులు ఎన్నుకునే స్థానాలని చెప్పారు. ఎమ్మెల్యేలు ఎన్నుకునే సభ్యుల సంఖ్య 17 నుంచి 20కి పెరుగుతుందని, అలాగే స్థానిక సంస్థల ప్రతినిధులు ఎన్నుకునే సభ్యుల సంఖ్య 17 నుంచి 20కి పెరుగుతుందని వివరించారు. పట్టభద్రులు, టీచర్ స్థానాల సంఖ్య యథాతథంగా ఐదు చొప్పున ఉంటుందని, మిగిలిన స్థానాలను గవర్నర్ కోటాలో భర్తీ చేస్తారని వివరించారు. అయితే విభజన చట్టంలో పొందుపరిచినట్టుగా రెండు రాష్ట్రాల శాసనసభ్యుల సంఖ్యను పెంచాల్సి ఉందన్న ఎంపీల డిమాండ్‌పై మంత్రి స్పష్టత ఇవ్వలేకపోయారు.
 
ఈ బిల్లుతో పరిస్థితులు మారవు: మిథున్‌రెడ్డి
ఎమ్మెల్సీ సంఖ్యను పెంచుతూ తెచ్చిన ఈ బిల్లు వల్ల ఆంధ్రప్రదేశ్‌లో తలెత్తిన దుర్భర పరిస్థితుల్లో ఏ మార్పులూ రావని వైఎస్సార్‌సీపీ ఎంపీ పి.వి.మిథున్‌రెడ్డి చెప్పారు. విభజన చట్టంలో పొందుపరిచిన హామీల అమలుకు నిర్దిష్ట కాలపరిమితి ఉండాలని కోరారు. ఈ చట్టం ఇచ్చిన హామీల అమలుకు ఎన్డీయే ప్రభుత్వ రెండు బడ్జెట్లలోనూ తగిన రీతిలో నిధులు కేటాయించలేదని విమర్శించారు. స్పెషల్ ప్యాకే జీ నామమాత్రంగా మారిందన్నారు.

జాతీ య విద్యాసంస్థలు కనీసం శంకుస్థాపనకు నోచుకోలేదని, వైఎస్సార్ జిల్లాలో స్టీల్ ప్లాం టు ఏర్పాటు తదితర హామీలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయని సభ దృష్టికి తెచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు కేవలం రూ. 100 కోట్లు కేటాయించారని, ఈ కేటాయింపులను చూస్తే ఇంకో 50 ఏళ్లయినా ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తంచేశారు.

ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. వందలాది మంది బలిదానంతో వచ్చిన తెలంగాణకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా న్యాయం జరగడం లేదన్నారు. ఆర్డినెన్స్ ద్వారా తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలిపారని, కానీ అక్కడి 2 లక్షల మంది ప్రజల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని చెప్పారు. ఒడిశా ఎంపీ ఆర్.కె.జెనాతో పాటు ఇతర పార్టీల ఎంపీలు మరికొందరు పోలవరం ప్రాజెక్టు చేపట్టడం సరికాదని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement