కొండను పిండేందుకు కొత్త కసరత్తు

Illegal Granite Works In East Godavari - Sakshi

టీడీపీ హయాంలో కోట్లు దోచుకున్న ‘తమ్ముళ్లు’

ఆనూరు కొండపై తవ్వకాలకు దరఖాస్తు

మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే అండ

కాసుల సంపాదనకు తెలుగు తమ్ముళ్లు ప్రకృతి వనరులను యథేచ్ఛగా దోపిడీ చేశారు. మట్టి మింగేశారు.. కొండలను కొల్ల గొట్టారు. అధికారం కోల్పోయినప్పటికీ పాత అలవాటును మాత్రం వారు మానలేదు. ఇప్పటికీ కొండలను గుల్ల చేసేందుకు యత్నాలు సాగిస్తూనే ఉన్నారు. ఆనూరు కొండపై ఇప్పుడు కన్నేశారు.

సామర్లకోట (పెద్దాపురం): పెద్దాపురం మండల పరిధిలో రామేశ్వరంపేట మెట్టను గుల్ల చేసిన తెలుగుదేశం పార్టీ నేతలు కోట్లాది రూపాయలు కూడబెట్టకున్నారు. అధికారం కోల్పోయినా వారు  గ్రావెల్‌ తవ్వకాలకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. గత మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే అనుచరులు ఈదిశగా ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు జోరుగా ఉన్నాయి. అందులో భాగంగానే వారు ఆనూరు కొండపై ఉన్న భూములను చదును చేసుకోడానికి అనుమతించాలంటూ  పెద్దాపురం తహసీల్దార్‌కు దరఖాస్తు చేశారు.  రామేశ్వరం కొండపై ఆనూరు, కొండపల్లి, రామేశ్వరంపేట, సూరం పాలెం, వాలుతిమ్మాపురం గ్రామాలకు చెందిన సుమారు 800 మంది దళితులు జీవనం సాగిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ పెద్దల అండతో మైనింగ్‌ మాఫియా ఆ భూముల్లోకి ప్రవేశించింది. దళితులతో తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకొని వారి అనుమతులు ఉన్నాయంటూ తవ్వకాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సుమారు 50 అడుగుల ఎత్తుగా వాలుగా ఉన్న కొండను తవ్వేసారు. ఈ కొండల మీదుగా 33కేవీ విద్యుత్తు స్తంభాలను ఏర్పాటు చేశారు. వాటి చుట్టూ కూడా గ్రావెల్‌ తవ్వేశాశారు. ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో రామేశ్వరంమెట్టపై ఉన్న భూములు 800 ఎకరాల వరకు పేద దళితులకు పంపిణీ చేశారు. తరువాత ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా మరో 530 ఎకరరాల భూమిని ఒక్కొక్క కుటుంబానికి ఎకరం 35 సెంట్లు చొప్పున పంపిణీ చేశారు.

రాజన్న హయాంలో బోర్లు 
వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2005–06లో కోట్లాది రూపాయలు వెచ్చించి ఇందిరా క్రాంతి పథం, ఇందిరా జల ప్రభ ద్వారా 72 బోర్లు వేయించి డ్రిప్‌ ఇరిగేషన్‌ పథకం ద్వారా పంట పొలాలకు పైపు లైన్లు వేయించారు. దాంతో మెట్టపై జీడీ మామిడి, దుంప, అపరాల పంటలు, ఆకుకూరలు, కాయగూరలు పండిస్తూ కుటుంబాలను పోషించుకొంటున్నారు. దాంతో ఎకరానికి రూ.30వేల నుంచి 40 వేల వరకు ఆదాయం వచ్చే దని రైతులు తెలిపారు. ఉపాధి హామీ పథకంలో మామిడి, జీడి మామిడి మొక్కలను ఈ మెట్టపై వేసుకునేందుకు అధికారులు మొక్కలను పంపిణి చేశారు. ఈ మొక్కల సంరక్షణ కోసం ప్రతీ నెల రూ.1500 నుంచి రూ.మూడు వేల వరకు ఇచ్చేవారు. విద్యుత్తు సదుపాయంతో బోర్ల ద్వారా వ్యవసాయం చేస్తున్న ఈ మెట్టను తవ్వుకొనేందుకు అధికారులు ఏ విధంగా అనుమతి ఇచ్చారో అర్థం కావడం లేదని దళిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రూ. వందల కోట్ల లావాదేవీలు
మెట్టపై తవ్వకాల ద్వారా వందల కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. దాదాపు 10 పొక్లెయినర్లతో 24 గంటల పాటు నిరంతరాయంగా తవ్వకాలు జరిగాయి. ఎకరం భూమిలో సుమారు 10వేల లారీల వరకు గ్రావెల్‌ తవ్వుతున్నట్టు తెలిసింది. లారీ గ్రావెల్‌ రూ.రెండు వేలకు విక్రయించారు. ఆ లెక్కన ఎకరం నుంచి వచ్చే ఆదాయం రూ. రెండు కోట్లు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆక్రమ తవ్వకాలకు బ్రేక్‌ వేసింది. అయితే తెలుగుదేశం నేతల అండతో ఆనూరు కొండపై నాలుగు ఎకరాల భూమిలో తవ్వకాలు చేసుకోడానికి అనుమతి ఇవ్వాలంటూ దరఖాస్తు చేసుకున్నారు.

గ్రావెల్‌ తవ్వకాలకు ఎటువంటి అనుమతులు లేవు
పెద్దాపురం డివిజన్‌ పరిధిలో గ్రావెల్‌ తవ్వకాలకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. ఏడీబీ రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి బీఎస్‌ఆర్‌ కనస్ర ్టక్షన్‌కు మాత్రమే అనుమతి ఉంది. అది కూడా ఏడీబీ రోడ్డు పనులు జరుగుతున్న సమయంలోనే గ్రావెల్‌ తవ్వకాలు చేయాలి. – ఎస్‌.మల్లిబాబు, ఆర్డీవో, పెద్దాపురం

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top