‘గృహ నిర్మాణం పేదలకు భారం కాకూడదు’ | Housing construction should not be a burden on the poor ' | Sakshi
Sakshi News home page

‘గృహ నిర్మాణం పేదలకు భారం కాకూడదు’

Dec 25 2013 2:02 AM | Updated on Sep 2 2017 1:55 AM

ప్రభుత్వం అందించే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేదలకు భారం కాకూడదని హౌసింగ్ పీడీ ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక హౌసింగ్ కార్యాలయం ప్రారంభోత్సవానికి మంగళవారం ఆయన విచ్చేశారు.

పుట్టపర్తి అర్బన్, న్యూస్‌లైన్ : ప్రభుత్వం అందించే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేదలకు భారం కాకూడదని హౌసింగ్ పీడీ ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక హౌసింగ్ కార్యాలయం ప్రారంభోత్సవానికి  మంగళవారం ఆయన విచ్చేశారు. అనంతరం హౌసింగ్ ఈఈ చంద్రమౌళిరెడ్డితో కలసి స్థానిక ఎమ్మార్సీ భవనం సమీపంలో ఏర్పాటు చేసిన తాపీ మేస్త్రీలు శిక్షణా కార్యక్రమంలో మాట్లాడారు.
 
 ఈ సందర్భంగా లబ్ధిదారుల ఆర్థిక స్థితిగతులకు అనుకూలంగా తక్కువ ఖర్చుతో ఇంటి నిర్మాణం చేపట్టేది తాపీ మేస్త్రీలే కావడంతో వారికి అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. అవగాహన సదస్సులు మండల కేందాల్లోనే గాక గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు ఎస్సీలకు లక్ష రూపాయలు, ఎస్టీలకు 1.05 లక్షలు, బీసీలకు రూ.70 వేలు మంజూరు చేస్తుందన్నారు. సమావేశం అనంతరం తక్కువ ఖర్చుతో ఇళ్లు, మరుగుదొడ్డి ఎలా నిర్మించుకోవాలా అనే వాటి సమస్యలను పరిష్కరించేందుకు మేస్త్రీలకు పుస్తకాలు పంపిణీ చేశారు.
 
 1.16 లక్షలు హౌసింగ్ దరఖాస్తులు పెండింగ్‌లో.. : జిల్లాలో ప్రస్తుతం 1.16 లక్షల హౌసింగ్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు హౌసింగ్ పీడీ ప్రసాద్ తెలిపారు. పుట్టపర్తికి మంగళవారం విచ్చేసిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మొదటి, రెండో రచ్చబండల్లో వచ్చిన దరఖాస్తుల్లో పరిశీలించిన అనంతరం మూడో విడత రచ్చబండలో 42,820 ఇళ్లు మంజూరు చేసినట్లు చెప్పారు.
 
 ఇంకా సుమారు 1.16 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటి పరిశీలన అనంతరం ఇళ్ల మంజూరు చేస్తామన్నారు. జిల్లాలో 914 ఇందిరమ్మ కాలనీలు ఉన్నాయన్నారు. వీటికి మౌలిక వసతులు కల్పన కోసం రూ.54 కోట్లు మంజూరు కాగా రూ.42 కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. విడపనకల్, రామగిరి మండలాల్లో జరిగిన అవినీతిపై విచారణ నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో 53 ఎస్సీ, ఎస్టీ కాలనీలకు సీసీ రోడ్లు, డ్రెయినేజీలు ఏర్పాటు చేయడానికి రూ.23 కోట్లతో ప్రతిపాదనలు పంపామన్నారు.
 
 50 శాతం జనాభా ఉన్న కాలనీలు మాత్రం ఇందులో ఉంటాయన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఒక్కో వర్క్ ఇన్స్‌పెక్టర్‌కు 75 ఇళ్లు నిర్మాణాలు పూర్తి చేయించడం, మరో 75 ఇళ్లు పలు దశల్లో బిల్లులు పంపిణీ చేయించడం లక్ష్యంగా నిర్ణయించామన్నారు. జిల్లాలో 62 ఏఈ కార్యాలయాలు నిర్మస్తుండగా 50 పూర్తైట్లు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement