‘హెలన్’తో జాగ్రత్త.. | 'Helan with caution .. | Sakshi
Sakshi News home page

‘హెలన్’తో జాగ్రత్త..

Nov 21 2013 3:17 AM | Updated on Oct 20 2018 6:17 PM

హెలన్ తుపాన్ ప్రభావం చిత్తూరు జిల్లాపై ఉంటుందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టరేట్‌కు ప్రభుత్వం బుధవారం రాత్రి సమాచారం పంపింది.

=రేపు జిల్లాపై ప్రభావం చూపనున్న తుపాన్
 =కలెక్టరేట్‌కు అందిన సమాచారం

 
చిత్తూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: హెలన్ తుపాన్ ప్రభావం చిత్తూరు జిల్లాపై ఉంటుందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టరేట్‌కు ప్రభుత్వం బుధవారం రాత్రి సమాచారం పంపింది. మూడు రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురిశాయి. ఇంతలోనే మరోసారి తుపానుతో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బంగాళాఖాతంలోని దక్షిణ ఆగ్నేయ దిశగా 310 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది.

గురువారం అర్ధరాత్రి దాటాక నెల్లూరు, కావలి మధ్య తీరం దాటే అవకాశమున్నట్లు విశాఖ వాతావరణ హెచ్చరిక కేంద్రం తెలిపింది. వాయుగుండం తుపానుగా ఏర్పడడంతో దీనికి హెలన్‌గా నామకరణం చేశారు. దీని ప్రభావం శుక్రవారం మధ్యాహ్నం తర్వాత జిల్లాపై పడనున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో చిత్తూరు, తిరుపతి డివిజన్ల పరిధిలోని మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. జిల్లా వాతావరణంలో బుధవారం సాయంత్రం నుంచి మార్పులు చోటుచేసుకున్నాయి. చలి తీవ్రత కాస్త తగ్గినా ఈదురుగాలులు మాత్రం వీస్తున్నాయి.

 హెల్ప్‌లైన్ల ఏర్పాటు

తుపాను కారణంగా జిల్లాలో ప్రమాదాలు చోటు చేసుకోకుండా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు డీఆర్వో శేషయ్య ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. కలెక్టరేట్, చిత్తూరు, తిరుపతి డివిజన్ కార్యాలయాల్లో హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేశామన్నారు. గురువారం సాయంత్రం నుంచి రౌండ్ ది క్లాక్‌లో అధికారులు విధులు నిర్వహిస్తారని వెల్లడించారు. కలెక్టరేట్ లో 08572 - 240500, చిత్తూరు ఆర్డీవో కార్యాలయంలో 08572- 226585, తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో 0877-2240201 నంబర్లను ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.      
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement