రోడ్డు ప్రమాదంలో హెడ్‌కానిస్టేబుల్ దుర్మరణం | head constable killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో హెడ్‌కానిస్టేబుల్ దుర్మరణం

Nov 18 2013 12:34 AM | Updated on Aug 30 2018 3:56 PM

రోడ్డు ప్రమాదంలో హెడ్‌కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం జరిగింది.

సంగారెడ్డి క్రైం, న్యూస్‌లైన్:  రోడ్డు ప్రమాదంలో హెడ్‌కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం జరిగింది. సంగారెడ్డి పట్టణంలోని సంజీవనగర్‌కు చెందిన విఠల్ (48) హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం ఆయన విధులు నిర్వహించడానికి ఇంద్రకరణ్ పోలీస్‌స్టేషన్‌కు బైక్‌పై వెళ్తున్నాడు.
 
 ఈ క్రమంలో కంది సమీపంలోని ఆర్టీఏ కార్యాలయం వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొన్నది. దీంతో విఠల్ తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. డీఎస్పీ వెంకటేశ్, రూరల్ సీఐ రఘు, ఎస్‌ఐ రాజశేఖర్, ఇంద్రకరణ్ ఎస్‌ఐ లాలూనాయక్‌లు అక్కడికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. విఠల్‌కు భార్య భూదేవి, కూతుళ్లు శ్రవంతి, శ్రావణి, సాయిభవాని, కొడుకు సాయి కార్తీక్ ఉన్నారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు జిల్లా కేంద్ర ఆస్పత్రికి చేరుకొని బోరున విలపించారు. విఠల్ భార్య భూదేవి, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
 
 పోలీసుల సంతాపం
 హెడ్‌కానిస్టేబుల్ విఠల్ మృతి పట్ల ఇంద్రకరణ్ ఎస్‌ఐ లాలూనాయక్‌తోపాటు సిబ్బంది ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో విఠల్ అంకితభావంతో పనిచేసేవారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement