అంగన్‌వాడీల్లో.. భయం భయం | Fear in anganvadies | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీల్లో.. భయం భయం

Dec 24 2015 2:20 AM | Updated on Jun 2 2018 8:29 PM

అంగన్‌వాడీల్లో.. భయం భయం - Sakshi

అంగన్‌వాడీల్లో.. భయం భయం

చాలీచాలని జీతాలతో భారంగా బతుకీడుస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది.

అంగన్‌వాడీల వేతనాలు పెంచండి
 
పెంచిన జీతాలను అమలు చేయాలంటూ..
విజయవాడలో సీఎం క్యాంప్ ఆఫీస్‌ను ముట్టడించిన
అంగన్‌వాడీలను కర్కశంగా అణదొక్కేందుకు
ప్రభుత్వం సిద్ధమైంది. విజయవాడ ధర్నాకు వెళ్లిన
కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు
విధులు నుంచి తొలగించాలని కలెక్టర్లకు ఆదేశాలు
అందాయి. దీంతో ఇప్పటికే ఉద్యోగ
భద్రతపై మీమాంసలో ఉన్న
అంగన్‌వాడీల్లో గుబులు మొదలైంది.

 
 
తిరుపతి: చాలీచాలని జీతాలతో భారంగా బతుకీడుస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. ప్రభుత్వం అంగన్‌వాడీలకు జీతాలు పెంచుతామని ప్రకటించినా ఆచరణలో మాత్రం అమలుకు నోచుకోలేదు. దీంతో వేతనాల పెంపు జీవోను వెంటనే విడుదల చేయాలనే డిమాండ్‌తో అంగన్‌వాడీలు ఈనెల 18వతేదీన ‘ఛలో విజయవాడ కార్యక్రమం’  నిర్వహించారు. ఇందుకోసం 13 జిల్లాల నుంచి వేలాదిమంది కార్యకర్తలు తరలి వెళ్లి ప్రభుత్వ తీరును ఎండగట్టారు.  ప్రభుత్వ ఆదేశాలతో రెచ్చిపోయిన పోలీసులు విచక్షణ రహితంగా అంగన్‌వాడీలపై దాడికి దిగారు. దీంతో శాంతియుత ప్రదర్శన కాస్తా.. ఖాకీల క్రౌర్యంతో రక్తసిక్తమైన సంగతి తెలిసింది. ఆ తర్వాత జీతాలను పెంచుతున్నట్లు సీఎం అసెంబ్లీలో ప్రకటించినా జీవో మాత్రం జారీ చేయలేదు. పైగా అంగన్‌వాడీలపై కక్షసాధించే విధంగా.. ఛలో విజయవాడ కార్యక్రమానికి హాజరైన అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులను తొలగించాలని ప్రభుత్వం 21 వతేదీన స్పెషల్ ఆఫీసర్  కేఆర్‌బీహెచ్‌ఎన్ చక్రవర్తి పేరుతో సర్క్యులర్ జారీ చేసింది.

జిల్లాకు చేరిన సీడీలు
చలో విజయవాడ కార్యక్రమానికి హాజరైన అంగన్‌వాడీలను గుర్తించే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. ఇందులో భాగంగా విజయవాడలో జరిగిన ధర్నా ఫొటోలున్న సీడీలను ప్రాజెక్టు డెరైక్టర్‌కు పంపారు. ప్రాజెక్టు డెరైక్టర్ వాటిని సంబంధిత సీడీపీవోలకు పంపి జిల్లాకు చెందిన అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు ఏవరైనా ఉన్నారా? అని ఆరా తీస్తున్నారు. ఫొటోలో గుర్తించిన వారిని తొలగించాలని సంబంధిత కలెక్టర్‌ను స్పష్టంగా ఆదేశించారు. ఈ మేరకు ఫొటోల్లో ఉన్న జిల్లా కార్యకర్తలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
 
 గుర్తించే పనిలో ఉన్నాం
 విజయవాడ ధర్నాలో పాల్గొన్నవారి ఫొటోలు వచ్చాయి. వాటి ఆధారంగా సిబ్బందితో  క్షేత్రస్థాయిలో పరిశీలించాం.  అయితే ఫొటోల్లో మన జిల్లాకు చెందిన అంగన్‌వాడీలుగా ఎవరూ కనిపించ లేదు.
 -లక్ష్మీ, ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్, చిత్తూరు.
 

Advertisement
 
Advertisement
Advertisement