వేతనాలు పెంచాలి.. నవచేతనా యాప్ రద్దు చేయాలి
ఐసీడీఎస్ అధికారులతో మూడు యూనియన్ల నేతలు
సాక్షి, అమరావతి : వేతనాల పెంపుతోపాటు అంగన్వాడీలకు సంబంధించిన అన్ని డిమాండ్లను పరిష్కరించాలని మూడు యూనియన్లకు చెందిన నేతలు మరోసారి స్పష్టం చేశారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూలకు చెందిన అంగన్వాడీ అనుబంధ సంఘాల నేతలతో ఐసీడీఎస్ అధికారులు సోమవారం జాయింట్ మీటింగ్ నిర్వహించారు. దాదాపు 3 గంటల సేపు జరిగిన చర్చల్లో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు వెంటనే వేతనాలు పెంచాలని, నవచేతనా యాప్ను రద్దు చేయాలని, పెండింగ్ ఉన్న మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, హెల్పర్ల ప్రమోషన్ గైడ్ లైన్స్ రద్దు చేయాలని కోరారు.
ప్రతిరోజు ఉదయం 9గంటల నుంచి సా.4 గంటల వరకు ఎప్పుడు ఏ పని చేయాలనే జాబ్ చార్టు తయారుచేయాలని తదితర డిమాండ్లను అధికారుల దృష్టికి తెచ్చారు. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అధికారులు తెలిపారు. సమావేశంలో ఐసీడీఎస్ జాయింట్ డైరెక్టర్లు ప్రవీణ, శివకుమారి, మూడు యూనియన్ల రాష్ట్ర కీలక నాయకులు కె.సుబ్బరావమ్మ, ఎ.బేబిరాణి, ఎంసీహెచ్ సుప్రజ, బి.లక్ష్మీదేవి, జె.లలితమ్మ, శారమ్మ, ప్రభావతి రాధా, మల్లేశ్వరి, జులేక, ఆర్.జ్యోతి, భారతి తదితరులు పాల్గొన్నారు.


