సీబీఐ అధికారులమంటూ దోపిడీ యత్నం | fake cbi officers attempt to robbery | Sakshi
Sakshi News home page

సీబీఐ అధికారులమంటూ దోపిడీ యత్నం

Mar 14 2015 3:11 AM | Updated on Aug 30 2018 5:24 PM

సీబీఐ అధికారులమంటూ ఓ ఇంటిలోకి చొరబడిన ముగ్గురు యువకులు దోపిడీకి విఫలయత్నం చేశారు.

కసింకోట : సీబీఐ అధికారులమంటూ ఓ ఇంటిలోకి చొరబడిన ముగ్గురు యువకులు దోపిడీకి విఫలయత్నం చేశారు. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా కసింకోట మండల కేంద్రంలో జరిగింది. ఆర్‌ఈసీఎస్ ప్రాజెక్టు ఇంజనీరు జి.శ్రీనివాసరావు అగ్రహారం వీధిలో నివాసం ఉంటున్నారు. శుక్రవారం ఉదయం ముగ్గురు యువకులు కారులో శ్రీనివాసరావు ఇంటికి వచ్చారు. తలుపు మూసి ఉండగా బయటి నుంచి బెల్ కొట్టి తాము సీబీఐ అధికారులమని, సోదాలు నిర్వహించడానికి వచ్చామంటూ తలుపులు తెరవాలని కోరారు.

 

ఆ సమయంలో శ్రీనివాసరావు భార్య హైమావతి ఒక్కరే ఇంటిలో ఉన్నారు. ఇంటి యజమాని లేని సమయంలో సోదాలు నిర్వహించడానికి కుదరదని, తర్వాత రావాలని చెప్పారు. అది విన్న దుండగులు తలుపులు బలవంతంగా తెరచుకుని లోపలికి ప్రవేశించారు. తుపాకీతో బెదిరించి బీరువా తలుపులు తెరచి వెతికిన తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. కొన్ని విలువైన వస్తువులను దోచుకెళ్లినట్టు తెలుస్తోంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement