నిత్యం అదనపు భారం రూ.18 లక్షలు | every time additional weightage is rupees 18 lakhs | Sakshi
Sakshi News home page

నిత్యం అదనపు భారం రూ.18 లక్షలు

Feb 7 2015 4:26 AM | Updated on Sep 2 2017 8:57 PM

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయనే ఆనందం రెండు రోజులు కొనసాగకుండానే చంద్రబాబు ప్రభుత్వం వ్యాట్ పేరుతో తగ్గినదానికి రెట్టింపు ధర చేయడంతో వాహనచోదకులు లబోదిబోమంటున్నారు.

- పెట్రోల్, డీజిల్‌లపై వ్యాట్ పెంపుతో వాహనదారుల గగ్గోలు
- చంద్రబాబు సర్కారు నిర్ణయంపై జిల్లావ్యాప్తంగా మండిపాటు

 
అమలాపురం : పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయనే ఆనందం రెండు రోజులు కొనసాగకుండానే చంద్రబాబు ప్రభుత్వం వ్యాట్ పేరుతో తగ్గినదానికి రెట్టింపు ధర చేయడంతో వాహనచోదకులు లబోదిబోమంటున్నారు. వ్యాట్ పెంపు వల్ల రవాణా, ఆర్టీసీ చార్జీలు పెరిగి సామాన్యులు సైతం ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. జిల్లాలో వివిధ కంపెనీల బంకులు 150 వరకు ఉండగా రోజుకు సుమారు 4.50 లక్షల లీటర్ల డీజిల్, పెట్రోల్ అమ్ముడవుతున్నట్టు అంచనా. దీనిలో డీజిల్ 3.10 లక్షల లీటర్లు కాగా, పెట్రోల్ 1.40 లక్షల లీటర్లు. వాటిపై లీటరుకు రూ.నాలుగు చొప్పున పెరగడం వల్ల జిల్లాలో వాహన వినియోగదారులపై రోజుకు రూ.18 లక్షల వరకు అదనపు భారం పడనుంది.
 
డీజిల్ పెంపుతో ఒక్క ఆర్టీసీపైనే రోజుకు రూ.2.40 లక్షల అదనపుభారం పడినట్టయింది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీ ఈ సాకుతో చార్జీలు పెంచితే సామాన్యులకు భారమవుతుంది. అలాగే లారీలు, ఇతర గూడ్స్ వాహనాలపై కూడా భారం ఎక్కువై రవాణా చార్జీలు పెరిగితే ఆ ప్రభావమూ సామాన్యులపై పడుతుంది. డీజిల్ ధర పెంపు కొబ్బరి, ఆక్వా రైతులకూ భారంగా మారనుంది.  జిల్లాలో మొత్తం 5,15,731 వాహనాలు ఉన్నా యి. వీటిలో అత్యధికంగా ద్విచక్ర వాహనాలు 4,22,546, కార్లు 25,617, ఆటోలు 21,423, గూడ్సు వాహనాలు 17,526 వరకు ఉన్నాయి. డీజిల్, పెట్రోల్ ధర పెంపుపై జిల్లా అంతటా వాహనచోదకులు మండిపడుతున్నారు. కేంద్రం తగ్గించగా, రాష్ట్రం పెంచడం భావ్యంగా లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని సామాన్యుడిని దోపిడీ చేయడం ఏమిటనే విమర్శలు వినిపిస్తున్నాయి.
 
సమంజసం కాదు..
కేంద్రం ధర తగ్గించిందని ఆనందపడుతున్న సమయంలో వ్యాట్ భారం మోపడం సమంజసం కాదు. రాష్ట్రంలోని అనేక ఆర్థిక వనరుల ద్వారా ఆదాయం తెచ్చుకోకుండా ప్రజలపై భారం వేస్తే ఎలా? పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిర్మిస్తామంటే రాష్ట్రం రూ.1,300 కోట్లతో ఎత్తిపోతల పథకమంటూ దుబారా చేయడం భావ్యంగా లేదు. ఇలాంటివి మానితే ప్రజలపై భారం మోపాల్సిన పనిలేదు.
 - వేటుకూరి సూర్యనారాయణరాజు, బీజేపీ, జిల్లా అధ్యక్షుడు

 

Advertisement
 
Advertisement
Advertisement