చీకట్లుతొలగేలా...!
చీకట్లో మగ్గుతోన్న ఎస్సీ, ఎస్టీ జనావాసాలకు విద్యుత్ వెలుగులద్దే దిశగా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఈపీడీసీఎల్) చర్యలు ప్రారంభించింది.
- 139 గిరిజన ఆవాసాల్లో విద్యుద్దీకరణ
- 94 ఎస్సీ కాలనీల్లో 1841 కొత్త సర్వీసులు
సాక్షి, విశాఖపట్నం : చీకట్లో మగ్గుతోన్న ఎస్సీ, ఎస్టీ జనావాసాలకు విద్యుత్ వెలుగులద్దే దిశగా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఈపీడీసీఎల్) చర్యలు ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులతో ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 94 ఎస్సీ కాలనీలు, 139 గిరిజన ఆవాసాల్లో వెలుగులు పూయించేందుకు సిద్ధమయ్యారు. సరఫరాలో అసమానతలు తొలగించేందుకు కొత్తగా సబ్స్టేషన్లను కూడా నిర్మిస్తున్నారు.
ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికలో రూ.10.47 కోట్లు
ఎస్సీ ఉప ప్రణాళికలో భాగంగా రూ.2.30 కోట్లతో 94 కాలనీలను విద్యుద్ధీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటి ద్వారా 1841 కొత్త సర్వీసులివ్వనున్నారు. అదేవిధంగా ఎస్టీ ఉప ప్రణాళికలో భాగంగా రూ.8.17 కోట్లతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. 139 గిరిజన ఆవాసాల్ని విద్యుద్ధీకరించి 2,761 కొత్త సర్వీసులకు ఇప్పటికే టెండర్లు పూర్తి చేసి, పనులు ప్రారంభించారు. మార్చి నెలాఖరునాటికి పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. మరోవైపు విద్యుత్ సరఫరాలో వ్యత్యాసాలు తొలగించేందుకు రూ.20.40 కోట్ల వ్యయంతో కొత్తగా 17 చోట్ల 33/11 కేవీ సబ్స్టేషన్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు. మార్చి నెలాఖరునాటికి మరో నాలుగు సబ్స్టేషన్లు పూర్తికి ప్రయత్నిస్తున్నారు. వీటికి తోడు రూ.74.80 కోట్ల వ్యయంతో కొత్తగా 33/11 కేవీ సబ్స్టేషన్లు 49 నిర్మించేందుకు టెండర్లు పిలిచారు.
రూ.33.81 కోట్లతో డీడీజీ పథకం
కొండప్రాంతాల్లో సౌరవిద్యుత్ శరణ్యం కావడంతో ఈ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో 194 గిరిజన ఆవాసాలల్లో సౌర విద్యుత్ వ్యవస్థకు టెండర్లు ఆహ్వానించారు. వికేంద్రీకృత విద్యుత్ ఉత్పాదన(డీడీజీ) పథకం రెండో దశలో భాగంగా రూ.33.81 కోట్లతో అంచనాలు సిద్ధం చేశారు. పనులు పూర్తయితే 5,592 గిరిజన కుటుంబాల్లో వెలుగులు పూయనున్నాయి.


