వర్షాభావ పరిస్థితులు వెంటాడటంతో రబీ నిరాశాజనకంగా సాగుతోంది. ఈ రబీలో సాధారణ సాగు విస్తీర్ణం 1,53,335 హెక్టార్లు కాగా ప్రస్తుతానికి లక్ష హెక్టార్ల విస్తీర్ణంలో వివిధ పంటలు సాగులోకి వచ్చాయి.
అనంతపురం అగ్రికల్చర్ : వర్షాభావ పరిస్థితులు వెంటాడటంతో రబీ నిరాశాజనకంగా సాగుతోంది. ఈ రబీలో సాధారణ సాగు విస్తీర్ణం 1,53,335 హెక్టార్లు కాగా ప్రస్తుతానికి లక్ష హెక్టార్ల విస్తీర్ణంలో వివిధ పంటలు సాగులోకి వచ్చాయి. 90 వేల హెక్టార్లుగా అంచనా వేసిన ప్రధాన పంట పప్పుశెనగ 66 వేల హెక్టార్లకు పరిమితమైంది. మూడు సంవత్సరాలుగా గిట్టుబాటు లేక పెద్ద ఎత్తున పప్పుశెనగ నిల్వలు పేరుకుపోవడం వల్ల సాగు విస్తీర్ణం తగ్గింది. అక్టోబర్ చివరి వారంలో నీలోఫర్ తుపాను వల్ల కొంతవరకు వర్షాలు పడిన ఫలితంగా ఈ మాదిరిగా పంటలు సాగులోకి వచ్చాయి.
లేదంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని అధికారులు అంచనా వేస్తున్నారు. వేరుశనగ విత్తుకునే సమయం దాటిపోయినా అనుకున్న విధంగా సాగులోకి రాలేదు. వేరుశనగ మరికొంత విస్తీర్ణం వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వరి నాట్లకు సమయం ఉండటంతో రబీ విస్తీర్ణం మరికొంత పెరిగే పరిస్థితి ఉంది.
జొన్న, పొద్దుతిరుగుడు పంటల విస్తీర్ణంలో తగ్గుదల ఎక్కువ కనిపిస్తోంది. ఉలవ, పెసర లాంటి పంటల విస్తీర్ణం కాస్తంత పెరిగింది. తెల్లకుసుమ పంట మరోసారి కొంత విస్తీర్ణంలో విత్తుకున్నారు. పప్పుశెనగ తరువాత ప్రధాన పంటలైన వరి, వేరుశనగ విస్తీర్ణం బాగా తగ్గింది. మొత్తమ్మీద ఈ రబీలో 50 వేల హెక్టార్లు బీడు భూములుగా దర్శనమిచ్చే పరిస్థితి నెలకొంది.