కుక్కలు చంపేస్తున్నా..దిక్కులేదు | Dogs Attack On Villagers | Sakshi
Sakshi News home page

కుక్కలు చంపేస్తున్నా..దిక్కులేదు

Apr 5 2018 11:11 AM | Updated on Sep 29 2018 4:26 PM

Dogs Attack On Villagers - Sakshi

తీవ్రంగా గాయపడిన భవాని, తీవ్రంగా గాయపడిన సరస్వతి

బాబోయ్‌.. కుక్కలు కరుస్తున్నాయి.. దయచేసి వాటి బారినుంచి తమను కాపాడండిఅంటూ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు అధికారులకు మొరపెట్టుకుంటున్నా అది చెవిటివాడి ముందు శంఖమూదినట్లే అవుతోంది. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో కుక్కల బారిన పడి పెద్దలు, పిల్లలు, వృద్ధులు, మహిళలు ఇలా అనేకమంది గాయపడుతున్నారు. ఇక రాత్రి సమయాల్లో ద్విచక్ర వాహనాల్లో వెళ్లే వారి పరిస్థితి దిన దిన గండం నూరేళ్ల ఆయుష్షులా తయారైంది. కుక్కలు వెంటబడితే వాటి బారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వాహనాన్ని వేగంగా నడిపి ప్రమాదాల బారిన పడుతున్నవారు అనేక మంది ఉన్నారు.

కడప అర్బన్‌ :  కడప నగరంలో బుధవారం ఓ పిచ్చికుక్క బీభత్సం సృష్టించింది. ఉదయం 6 గంటల నుంచి కరవడమే పనిగా పెట్టుకుంది. ఎర్రముక్కపల్లె, ద్వారకా నగర్‌ ప్రాంతాల్లో కనిపించిన వారందరినీ కరిచింది. ఆ రెండు ప్రాంతాలలో నివసిస్తున్న దాదాపు 20 మందికి పైగా ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు.

మా అమ్మ మీద పడి కరిచేసింది: సరస్వతి కుమార్తె హారతి
మా ఇంటి సమీపంలో ఉండగా ఓ పిచ్చికుక్క వచ్చి ఉన్నట్లుండి మా అమ్మ సరస్వతమ్మ మీదపడి తీవ్రంగా గాయపరిచింది. తలకు, కుడి చేతికి, ఎడమకాలికి కరిచేసింది. 

ఉదయం నుంచి కరుస్తున్నా పట్టించుకోలేదు : కమల
మాది ద్వారకా నగర్‌. మా అన్న కుమారుడు తన్వీష్‌ కుమార్‌ను పాఠశాల నుంచి ఇంటికి తీసుకుని వస్తుండగా నన్ను పిచ్చికుక్క కరిచింది. తర్వాత తన్వీష్‌ను గాయపరిచింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒకే పిచ్చికుక్క కరుస్తున్నా , చుట్ట పక్కల వారు నగర పాలక సంస్థ వారికి సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదు.

పిచ్చికుక్క బాధితులకు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తాం : రిమ్స్‌ సూపరింటెండెంట్‌
కడప నగరంలో పిచ్చికుక్క కాటు బారిన పడిన వారు ఎవరున్నా రిమ్స్‌లో ప్రత్యేక వైద్యసేవలను అందిస్తామని రిమ్స్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ టి. గిరిధర్, ఆర్‌ఎంఓ డాక్టర్‌ జంగం వెంకట శివ తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి కుక్కకరిచిన 6–12 గంటలలోపు ‘ఇమ్యునో గ్లోబిలిన్స్‌’ ఇంజక్షన్‌ను ఇస్తామన్నారు. ఈ ఇంజక్షన్‌ ఏఆర్‌వీ కన్నా రెట్టింపుగా పనిచేస్తుందని తెలిపారు. బాధితులు త్వరగా కోలుకునేలా చేస్తామన్నారు.  

కుక్కల నియంత్రణకు చర్యలేవీ..!
గతంలో వీధి కుక్కలను పట్టుకెళ్లి చంపేసేవారు. ఆ తర్వాత జంతు సంరక్షణ చట్టం పేరుతో.. కుక్కలను చంపకూడదనే నిర్ణయంతో వాటిని అలాగే వదిలేశారు. దీంతో ఏ వీధిలో చూసినా పదుల సంఖ్యలో కుక్కలు పెరిగి పోయాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా అవి జనంపై దాడి చేస్తున్నాయి. కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి తిరిగి అక్కడే వదిలేసే కొత్త కార్యక్రమం కొద్ది నెలల క్రితం చేపట్టి వదిలేశారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించినా కుక్కలు మాత్రం అక్కడే ఉంటుండటంతో ప్రతి ఒక్కరూ వాటి బారిన పడక తప్పడం లేదు. కుక్కలను చంపడం పాపం.. నేరం.. ఘోరం.. అనుకుంటే.. వాటి చేతిలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నవారు.. తీవ్రంగా గాయపడుతున్న వారి పరిస్థితిని ఏమనాలి.. అందుకే కుక్కలను పట్టుకెళ్లి జిల్లా సరిహద్దుల్లోని దట్టమైన అడవుల్లో వదిలేస్తే ఎవరికీ ఏ సమస్య ఉండదని పలువురు సూచిస్తున్నారు. ఇలా చేయడమొక్కటే కుక్కల బారినుంచి బయటపడేందుకు శాశ్వత పరిష్కారం అని పేర్కొంటున్నారు. అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకోవడం అవసరం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement