కోటి సంతకాల పేరుతో కాంగ్రెస్ నాటకం | Sakshi
Sakshi News home page

కోటి సంతకాల పేరుతో కాంగ్రెస్ నాటకం

Published Tue, Feb 24 2015 5:41 AM

crore signatures Name With Congress drama

బీజేపీ యువ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి
కనిగిరి : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఛీకొట్టినా.. కోటి సంతకాల పేరితో ఆ పార్టీ నాయకులు కొత్త నాటకం  ఆడుతున్నారని బీజేపీ యువ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. స్థానిక సాయిబాబ కల్యాణ మండపంలో సోమవారం జరిగిన యువమోర్చ జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై బీజేపీ కట్టుబడి ఉందని, కావాలని కాంగ్రెస్ నాయకులు బురద చల్లుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతొందని భయపడి కాంగ్రెస్ పార్టీ విషప్రచారం చేస్తోందన్నారు.

కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు చేస్తున్న ఎల్‌ఈడీ బల్బుల పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో అనేక పథకాలు అమలవుతున్నాయని యువ మోర్చ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రత్యేక హోదా అంశంలో జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు. జీవో నంబరు 101ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
 
బీజేపీ దళిత విభాగం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య మట్లాడుతూ యువత పార్టీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు.   బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర యాదవ్ మాట్లాడుతూ యువ మోర్చ కార్యకర్తలు గ్రామ స్థాయి నుంచి పార్టీ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా సుద్దికట్టు ఆంజనేయులు బీజేపీలో చేరారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు బత్తిన నరసింహారావు, మువ్వల రమణారావు, గోళి నాగేశ్వరరావు, పల్లి కృష్ణారెడ్డి, శాసనాల సరోజని, లక్ష్మన్, ధనంకుల శివాజీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement