
పార్టీలకు కాకుంటే కార్పొరేట్లకు ఇస్తారా?
రాజకీయ పార్టీల కార్యాలయాలకు కాకుండా కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వ స్థలాలు ఇస్తారా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ ప్రశ్నించారు.
హైదరాబాద్: రాజకీయ పార్టీల కార్యాలయాలకు కాకుండా కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వ స్థలాలు ఇస్తారా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ ప్రశ్నించారు. స్థలాల కేటాయింపుపై రాజకీయ పార్టీలకు, ప్రభుత్వానికీ నోటీసులు ఇవ్వాలన్న హైకోర్టు తీర్పుపై ఆయన ఘాటుగా స్పందించారు. విలువైన భూములను లాభాపేక్షతో నిర్వహిస్తున్న కార్పొరేట్ సంస్థలకు ఎకరా రూపాయికి కేటాయించిన సంగతి న్యాయవ్యవస్థకు తెలియదా? అని మంగళవారం ఒక ప్రకటనలో నిలదీశారు.
సమాజసేవకు ఉద్దేశించిన రాజకీయ పార్టీలకు ప్రభుత్వ స్థలాలు కేటాయింపులు చేస్తే.. ప్రజాస్వామ్య వ్యవస్థలో కార్యనిర్వాహక బాధ్యతల్లోకి హైకోర్టు జోక్యం చేసుకోవడం పట్ల ఆయన అభ్యంతరం తెలిపారు. పార్టీ కార్యాలయాలకు స్థలాలు కేటాయిస్తే తప్పేమిటని ప్రశ్నించారు. ఇతర దేశాల్లో ఎన్నికల ఖర్చును, ప్రచార ఖర్చును సైతం ప్రభుత్వాలే భరిస్తున్నాయని, ఆ వైపు పయనించాలే తప్ప స్థలాల కేటాయింపుపై అభ్యంతరం చెప్పడంలో ఔచిత్యం లేదని అన్నారు.
రాష్ట్ర ఉన్నత ధర్మాసనం సైతం సమాజ సేవా కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై తీర్పులిచ్చే ముందు సహజ న్యాయసూత్రాలను పాటించాలని సూచించారు. కోర్టు తీర్పులను సీపీఐ గౌరవిస్తుందంటూనే.. అవసరమైతే అత్యున్నత న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని ఆయన స్పష్టం చేశారు.