కాంగ్రెస్ మాట తప్పే పార్టీ కాదు | Congress will not go back on Telangana decision | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ మాట తప్పే పార్టీ కాదు

Oct 8 2013 3:32 AM | Updated on Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్ మాట తప్పే పార్టీ కాదని ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సిద్ధపడిన విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖా మంత్రి గీతారెడ్డి అన్నారు.

న్యాల్‌కల్, న్యూస్‌లైన్: కాంగ్రెస్ మాట తప్పే పార్టీ కాదని ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సిద్ధపడిన విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖా మంత్రి గీతారెడ్డి అన్నారు. జహీరాబాద్ నియోజక వర్గంలోని 127 గ్రామాలకు మంజీర నీటిని అందించేందుకు ఉద్దేశించిన పథకాన్ని సోమవారం న్యాల్‌కల్ మండల పరిధిలోని మిర్జాపూర్(ఎన్)లో ఆమె ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి గీతారెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చేది తామేనని కాంగ్రెస్ పార్టీ ఎన్నోమార్లు చెప్పిందన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాతృ సమానురాలు సోనియాగాంధీయేనన్నారు.
 
 తెలంగాణ ఏర్పాటుకు 1969నుంచి పోరాటాలు సాగుతున్నాయని ఈ సందర్భంగా అనేక మంది యువకులు, విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు టీనోట్ సిద్ధమైనందున త్వరలో పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశ పెడతారన్నారు. రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య తొలిగిపోవడమే కాకుండా,  అభివృద్ధి కూడా జరుగుతుందన్నారు. తెలంగాణ  కోసం తమ పార్టీయే కృషి చేసిందని, టీఆర్‌ఎస్ చేసిందడం సరికాదన్నారు. జాతీయ ఉత్పాదక మండలిలో భాగంగా దేశంలోని 11ప్రాంతాలకు పరిశ్రమల సమూహాలు మంజూరయ్యాయని అందులో న్యాల్‌కల్ మండలం ఉండడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. ఇందుకు కోసం అవసరమయ్యే 12వేల ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించామని,  అవరమైతే ప్రైవేట్ భూములను రైతుల షరతులకు లోబడి తీసుకుంటామన్నారు.అందుకు రూ. 32లక్షల కోట్లు ఖర్చు కానున్నాయని, ఫలితంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు ఈప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు.
 
 పరిశ్రమల స్థాపనకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలన్నీ ఈప్రాంతంలో ఉన్నాయన్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని అన్ని గ్రామా ల ప్రజలకు మంచినీటి అందించేందుకే మంజీర నీటి పథకాన్ని మంజూరు చేశామన్నారు. మొదటి విడతగా 28గ్రామాలకు ఈ నీటి అందిస్తామని, ప్రస్తుతం కొన్ని గ్రామాలకు మాత్రమే నీటిని అం దిస్తున్నామని త్వరలో అన్ని గ్రామాలకు నీటి సరఫరా జరుగుతుందన్నారు. ఈ పథకం పూర్తి కావడానికి పెద్ద మొత్తంలో నిధులు అవసరమైనందున కేంద్ర  ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. రెండో విడత నీరందించనున్న గ్రామాల్లో పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. ఎంపీ సురేశ్ షెట్కార్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన మంచినీటి పథకం వల్ల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న మంచి నీటి సమస్య పరిష్కారం కానుందన్నారు. స్థానిక సర్పంచ్ శారద అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డీసీసీబీ చెర్మైన్ జైపాల్‌రెడ్డి,ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ విజయ్‌ప్రకాశ్, డీసీసీ ప్రధాన కార్యదర్శులు భాస్కర్‌రెడ్డి, అడివిరెడ్డి, శివాజీ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
 
 జాతీయ నాయకులను అవమానించడం సరికాదు
 సీమాంధ్ర నాయకులు జాతీయ నాయకుల విగ్రహాలను ధ్వంసం చేయడం, వారి ఫ్లెక్సీలను చించివేయడం సరి కాదని మంత్రి గీతారెడ్డి హితపు పలికారు. సోమవారం న్యాల్‌కల్ మండలం మిర్జాపూర్(ఎన్)గ్రామంలో మంచి నీటి పథకాన్ని ఆమె ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా స్వామ్యంలో సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు చేయడంలో తప్పు కాదని, కానీ ఉద్యమాల ముసుగులో జాతీయ నాయకులను అవమానించడం క్షమించరాని నేరమన్నారు.  గాంధీ కుటుంబానికి చెందిన  ఫ్లెక్సీలను చించి వేయడం, తగులబెట్టి అవమానించడం త గదన్నారు. ప్రధాని పదవిని  త్యాగం చేసి ఇచ్చిన మాటకోసం కట్టుబడిన తల్లిలాంటి సోనియాగాంధీని అవమాన పర్చడం దారుణమన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement