సమష్టిగా సమైక్యాంధ్ర ఉద్యమం | collective as amaikyandhra movement | Sakshi
Sakshi News home page

సమష్టిగా సమైక్యాంధ్ర ఉద్యమం

Jan 13 2014 11:55 PM | Updated on Mar 28 2019 5:34 PM

ఇకపై ప్రజా సంఘాలు, రాజకీయ వ్యవస్థతో కలిసి సమైక్యాంధ్ర ఉద్యమం నిర్వహిస్తామని ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షుడు పి.అశోక్‌బాబు పేర్కొన్నారు.

గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: ఇకపై ప్రజా సంఘాలు, రాజకీయ వ్యవస్థతో కలిసి సమైక్యాంధ్ర ఉద్యమం నిర్వహిస్తామని ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షుడు పి.అశోక్‌బాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం (ఏపీజేఎఫ్) ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగస్వాములైన ఉద్యోగులు, ప్రజా, రాజకీయ, విద్యార్థి జేఏసీలకు చెందిన ప్రతినిధులతో స్థానిక ఎన్జీవో కల్యాణ మండపంలో సోమవారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు.  ఏపీ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణాంజనేయులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో అశోక్‌బాబు ముఖ్య అతిథిగా మాట్లాడుతూ రాజకీయ వ్యవస్థ బాధ్యత ఉద్యోగస్తులు భుజానికెత్తుకున్నామని, సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు మాత్రం బాధ్యతగా వ్యవహరించడం లేదన్నారు.

ఉద్యమం తారస్థాయికి చేరిన సమయంలో సమైక్యాంధ్ర ఉద్యమానికి తాము ద్రోహం చేశారని మాట్లాడుతున్నారని, ఎవరికైనా విశ్రాంతి అనేది కావాలని వివరించారు. రాజకీయాల్లోకి రావాలన్న ఆశ, ఆసక్తి తనకు లేవన్నారు. ఈ నెల 17, 18 తేదీల్లో చేపట్టనున్న బంద్ తేదీలను రీ షెడ్యూల్ చేస్తామని, 20 నుంచి 23 వరకు అసెంబ్లీలో జరిగే కార్యక్రమాలపై అప్రమత్తంగా వ్యవహరించి నిరసన కార్యక్రమాల్ని రూపొందిస్తామన్నారు. తెలంగాణా బిల్లు ప్రతులు భోగి మంటల్లో తగలబెడితే విభజనవాదులకు గుర్తుకొచ్చిన ఆత్మాభిమానం సీమాంధ్ర ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులపై దాడులు చేసినప్పుడు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు.

 సమైక్య తీర్మానం చేయాల్సిందే..
 సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ ఆచార్య ఎన్.శామ్యూల్  మాట్లాడుతూ రాష్టాన్ని సమైక్యంగా ఉంచేందుకు అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. సమైక్య తీర్మానం చేయాలని కోరడం రాజకీయ ప్రేరేపితమైన చర్య కాదని ఆయన స్పష్టం చేశారు. జేఏసీ గౌరవాధ్యక్షుడు ఆచార్య పి.నరసింహారావు మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంకోసం నెలల తరబడి ఉద్యమాలు ప్రపంచంలో ఎక్కడా జరగలేదని, సభలో జరిగిన చర్చలో సభ్యులు వ్యక్తం చేసిన అభ్యంతరాలు పేలవంగా ఉన్నాయన్నారు.

 మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యమంలో ఉద్యోగులు కీలకపాత్ర పోషించారని ప్రశంసించారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ తెలంగాణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో జరిగే చర్చించే సమయంలో ప్రతి అంశంపై అప్పటికప్పుడే ఓటింగ్ నిర్వహించాలని పట్టుబడతామని, సీమాంధ్ర ప్రాంతంలోని ఎమ్మెల్యేలతో కలిసి ముందుగా సమైక్య తీర్మానం చేయాలని కోరతామన్నారు.   వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర మహిళా కమిటీ సభ్యురాలు మేరిగ విజయలక్ష్మి మాట్లాడుతూ తెలంగాణా ముసాయిదా బిల్లుపై అసెంబీల్లో చర్చ ప్రారంభించే ముందు సమైక్య తీర్మానం చేయాలని పార్టీ పరంగా పట్టుబడితే విభజనవాదం అంట గట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగ కన్వీనర్ ఆతుకూరి ఆంజనేయులు మాట్లాడుతూ అసెంబ్లీలో మెజారిటీ సభ్యుల అభిప్రాయం సమైక్యాంధ్ర అయినప్పుడు ఇక చర్చతో పనే ముందన్నారు.   సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ డాక్టర్ మండూరి వెంకటరమణ ,ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర, ఏపీఎన్జీవో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, రెవెన్యూ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వరరావు, ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, జిల్లా ప్రతినిధి పీఎస్ మూర్తి, జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు వెంకయ్య, ఏపీఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు టీవీ రామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి బి.ప్రభాకరరావు, నగర అధ్యక్షుడు హృదయరాజు, విద్యుత్ జేఏసీ అధ్యక్షుడు రవిశేఖర్, ప్రజా సంఘాల జేఏసీ కన్వీనర్ సిరిపురపు శ్రీధర్, మాదిగ జేఏసీ కార్వ నిర్వాహక అధ్యక్షుడు మానుకొండ శివప్రసాద్, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement