గిరిజనుల సాగులోని భూములకు పట్టాలు | CM YS Jagan comments in a review on ROFR Patta | Sakshi
Sakshi News home page

గిరిజనుల సాగులోని భూములకు పట్టాలు

Jul 11 2020 4:57 AM | Updated on Jul 11 2020 7:54 AM

CM YS Jagan comments in a review on ROFR Patta - Sakshi

ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: క్లెయిములను పరిశీలించి గిరిజనులకు మేలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆగస్టు 9 ఆదివాసీ దినోత్సవం రోజున గిరిజనులకు పట్టాలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అటవీ భూములపై సాగు హక్కుల కోసం చాలా కాలంగా వేచి చూస్తున్న గిరిజనులకు ప్రయోజనం కల్పించాలని సీఎం స్పష్టం చేశారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..

► అర్హత ఉన్న వారందరికీ సాగు హక్కులు కల్పించాలి. పట్టాలు ఇచ్చాక ఆయా భూముల అభివృద్ధిపై కార్యాచరణ తయారు చేయాలి.
► ఆ భూముల్లో ఏయే పంటలు సాగు చేయాలన్న దానిపై ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలి. ఇందుకోసం వ్యవసాయ, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలి.
► ఇందుకోసం గిరిభూమి పేరుతో పోర్టల్‌ను ప్రారంభిస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. సమీక్షలో డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, రెవెన్యూ, అటవీ, గిరిజన సంక్షేమ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.   

గిరిజనం కోసం సీఎం చొరవ
► గిరిజన రైతులు రిజర్వు ఫారెస్ట్‌ను ఆనుకుని చాలా వరకు సాగు చేసుకుంటున్నారు. ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాల కోసం దరఖాస్తులు చేశారు. అయితే అధికారుల పరిశీలనలో ఇవి బంజరు భూములుగా తేలడంతో మొదట ఆ దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. 
► ఈ విషయం సీఎం జగన్‌ దృష్టికి వెళ్లడంతో వారందరికీ పట్టాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 
► బంజరు భూముల్లో సాగు చేస్తున్న గిరిజనులు సుమారు 10 వేల మంది ఉన్నారని అధికారులు గుర్తించారు. 21 వేల ఎకరాల బంజరు భూముల్లో ప్రస్తుతం పంటలు సాగు చేస్తున్నారు. 
► పోడు వ్యవసాయం చేసుకునే గిరిజన రైతులకు ఫారెస్ట్‌ వారి నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా భూమి హక్కు పత్రాలు ఇస్తారు. 
► వైఎస్సార్‌ హయాంలో లక్షల మంది గిరిజనులకు ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇచ్చారు. అప్పటి నుంచి వ్యవసాయాన్ని నమ్ముకుని బతుకుతున్నారు. 
► గిరిజనులు పండించే వ్యవసాయ ఉత్పత్తులకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి గిరిజన కో ఆపరేటివ్‌ కార్పొరేషన్‌ ద్వారా కొంటోంది.

Advertisement
 
Advertisement
Advertisement