అగ్రి మార్కెటింగ్‌ ఇంటెలిజెన్స్‌పై సీఎం జగన్‌ ఆరా

CM Jagan Hold Review Meeting On Agriculture Mission - Sakshi

 సాక్షి, అమరావతి : వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, మార్కెటింగ్‌పై అత్యుత్తమ నిపుణులతో ఒక సెల్‌ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం ఆయన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ మిషన్‌పై సమీక్ష నిర్వహించారు. అగ్రి మార్కెటింగ్‌ ఇంటెలిజెన్స్‌పై ఆరా తీశారు. పంటలు, వాటికి లభిస్తున్న ధరలపై ఎప్పటికప్పుడు సమాచారం ఎలా వస్తుందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. మార్కెటింగ్‌ ఇంటెలిజెన్స్‌పై సమర్థవంతమైన యంత్రాంగం ఉండాలని సూచించారు. ప్రత్నామ్నాయ విధానం కూడా ఉండాలని స్పష్టం చేశారు. అగ్రికల్చర్‌ కమిటీల నుంచి వచ్చే సమాచారాన్ని బేరీజు వేసుకోవడానికి మరో యంత్రాంగం అవసరమని సీఎం అభిప్రాయపడ్డారు. పంటల ధరలను స్థిరీకరించడానికి దీర్ఘకాలిక ప్రణాళికతో వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ మిషన్‌ తదుపరి సమావేశంలో రాబోయే పంటల దిగుబడులు, వాటికి లభించే మద్దతు ధరల అంచనాలు, మార్కెట్‌లో పరిస్థితులను నివేదించాలాని అధికారులను ఆదేశించారు. 

సమీక్షలో చర్చించిన మరిన్ని అంశాలు
 

  • మినుములు, పెసలు, శెనగలు, టమోటాలకు సరైన ధరలు రావడంలేదని అధికారులు చెప్పారు. 
  • ప్రభుత్వం వద్ద, రైతుల వద్ద నిల్వలు ఉన్నాయని, దీంతోపాటు దిగుమతి విధానాలు సరళతరం చేయడం కూడా ధరలు తగ్గడానికి ప్రధాన కారణమని చెప్పారు. 
  • వచ్చే రబీ సీజన్‌లో పప్పు దినుసలకు తక్కువ ధరలు నమోదయ్యే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.
  • ఉల్లి ధరలు వినియోగదారుల మార్కెట్లో కాస్త పెరుగుతున్నాయని సీఎం దృష్టికి తీసుకొచ్చారు
  • ఈ పంటలకు సంబంధించి కొనుగోళ్లకోసం ప్రణాళిక వేశారా? లేదా? అని సీఎం అడిగి తెలుసుకున్నారు. 
  • తగినన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలుపెట్టారా? లేదా? అని అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. 
  • మద్దతు ధరలు దొరక్క, కొనుగోలు కేంద్రాలద్వారా కొనుగోలు చేయక గత ప్రభుత్వం హయాంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని సీఎం అన్నారు.
  • గతంలో వ్యాపారులు, రాజకీయ నాయకులు రైతుల ముసుగులో అక్రమాలకు పాల్పడ్డారని సమావేశంలో ప్రస్తావించారు.
  • కొన్ని జిల్లాల్లో ఈ ఘటనలు అధికంగా జరిగాయని అధికారులు తెలిపారు.
  • ఇంతకు ముందు రైతులకు కనీస మద్దతు ధర కల్పించడానికి నిధుల సహకారం లేదు. పంటలకు ధర పడిపోయిన తర్వాత... ఆ నిధులు తెచ్చుకునే సరికి పుణ్యకాలం కాస్త గడచిపోయేదని అధికారులు సీఎంకువివరించారు.
  • పంట చేతికి వచ్చే సమయానికే కొనుగోలు కేంద్రాలు సిద్దంకావాలని సీఎం ఆదేశించారు.
  • అక్టోబరు 15 నాటికే మినుములు, పెసలు,శెనగల తదితర పంటల కొనుగోలుకోసం కేంద్రాలు తెరవాలని అధికారులకు సూచించారు.
  • రైతులకు కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధర ఇవ్వడానికి మంచి విధానాలపై ఆలోచనలు చేయాలని అధికారులకు సూచించారు. 
  • కొనుగోలు కేంద్రాలవద్ద వారికి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులకు తెలిపారు.
  • గ్రామ సచివాలయాల ద్వారా పలానా పంటలు వేశామంటూ రైతులు సులభంగా రిజిస్ట్రేషన్‌ చేయింకునేలా చూస్తామని అధికారులు తెలిపారు. 
  • గ్రామవాలంటీర్ల సహాయంతో ప్రతిరైతూ రిజిస్ట్రేషన్‌ చేయించుకునేలా చేస్తామని, దీనిద్వారా సరైన మద్దతు లభించేలా ప్రభుత్వ తీసుకునే చర్యల ద్వారా లబ్ధి రైతుకు లభిస్తుందని అధికారుల వెల్లడించారు.
  • ఈ డేటా ఆధారంగా ఆపంటకు కచ్చితంగా మద్దతు ధర ఇచ్చేలా చూస్తున్నామని అధికారులు తెలిపారు.
  • రబీ పంటనుంచి ఈ పద్ధతిని అనుసరించడానికి ప్రయత్నాలుచేస్తామని వెల్లడించారు. పంట చేతికి వచ్చినప్పుడే కొనుగోలు చేస్తే.. రైతులకు లబ్ధి చేకూరుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు.
  • ధరలస్థిరీకరణ నిధిని సద్వినియోగం చేసుకోవడంతోపాటు, కొనుగోలు కేంద్రాలద్వారా తీసుకున్న వ్యవసాయ ఉత్పత్తులకు మంచి మార్కెట్‌ కల్పించే పద్ధతుల ద్వారా రైతులకు మరింత లబ్ధి చేకూర్చేలా చూడాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. 
  • రాష్ట్ర వర్షపాతం, పంటసాగు వివరాలను సీఎం జగన్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కరువు కారణంగా ఆయా జిల్లాల్లో పరిస్థితులను సీఎం జగన్‌కు అధికారులు నివేదించారు. వివిధ వరద జలాలను
  • సమర్థవంతంగా వినియోగించుకునే ప్రణాళికలు ఆలోచించాలని సీఎం సూచించారు. 
  • గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ. 1830 కోట్లలను ఈ నెలాఖరులో రైతులకు ఇస్తామని అధికారులు తెలిపారు. వచ్చే నెలలో ప్రభుత్వం అందించే రైతు భరోసా,ఇన్‌పుట్‌సబ్సిడీలు రైతులకు అండగా ఉంటాయని సీఎం అభిప్రాయపడ్డారు.
  • తృణధాన్యాల సాగుమీద దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు.వర్షపాతం లోటు ఉన్న అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో తృణధాన్యాల సాగును ప్రోత్సహించాలని సీఎం సూచించారు. 
  • తృణధాన్యాల సాగును ప్రోత్సహించడమే కాకుండా.. ప్రాససింగ్‌ యూనిట్ల ఏర్పాటు కూడా కీలకమని సీఎం అభిప్రాయపడ్డారు.ఆమేరకు అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

టమోటా ధరలు తగ్గడంపై సమావేశంలో చర్చ
టమోటా ధరలు తగ్గడంపై వ్యవసాయ మిషన్‌ సమావేశంలో ప్రస్తావను వచ్చింది. ధరలు తగ్గడానికి గల కారణాలపై సీఎం జగన్‌ ఆరా తీశారు. కర్ణాటక, మహారాష్ట్రలలో టమోటా దిగుమతులు అధికంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో భారీవర్షాలు, వరదలు కూడా రవాణాకు అడ్డంకిగా మారి ధరలు పెరిగాయని అధికారులు వివరించారు. టమోటా ధరలు పడిపోకుండా చూడడానికి ఏం చేయాలన్న దానిపై సీఎం జగన్‌ అధికారుల నుంచి సలహాలు తీసుకున్నారు. చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్‌ తదితర మార్కెట్లకు పంపించడం ద్వారా కొంత మేర ధరల నిలబెట్టవచ్చని అధికారులు సూచించారు.

అయితే తక్షణమే అలాంటి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే రవాణా ఖర్చులను సబ్సిడీగా భరించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోతున్నప్పుడు డైనమిక్‌గా  వ్యవహరించాలంటూ అధికారులకు ఆదేశించారు. పశువుల కోసం వినియోగిస్తున్న ఔషధాల్లో ప్రమాణాలు, నాణ్యత ఉండడంలేదని సమావేశంలో ప్రస్తావించారు. ప్రపంచస్థాయి ప్రమాణాలు, నాణ్యత ఉండేలా చూడాలని సీఎం ఆదేశించారు. ఎండిపోతున్న మామిడి, చీనీ తదితర పంటలను కాపాడేందుకు నీటిసరఫరాకోసం పెండింగ్‌లో ఉన్న నిధులను వెంటనే విడుదలచేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top