ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు!

Child Line Officials Councelling On Child Marriage In Kurnool - Sakshi

అబ్బాయికి 16..అమ్మాయికి 28 ఏళ్లు

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు...ఇరుక్కుపోయారు

ఇరువురికి కౌన్సెలింగ్‌ చేసిన కలెక్టర్‌

అతడికి పదహారు.. ఆమెకు ఇరవై ఎనిమిదేళ్లు. అయినా వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. కుటుంబాలను ఒప్పించారు. పెద్దల సమక్షంలోనే అంగరంగ వైభవంగా పెళ్లి కూడా చేసుకున్నారు. ఇక సమస్యేమీ లేదనుకున్న సమయంలో కథ అనుకోని మలుపు తిరిగింది. పెళ్లి ఫొటోలు వాట్సాప్‌లో చక్కర్లు కొట్టడంతో పాటు పత్రికల్లో రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. బాల్య వివాహమంటూ వధూవరులను వేరు చేసి ఎవరిళ్లకు వారిని పంపించేశారు.  

కర్నూలు :  కర్ణాటక రాష్ట్రం శిరుగుప్ప తాలూకా చాణికనూరు గ్రామానికి చెందిన మూకమ్మ, హనుమంతప్ప కుమార్తె అయ్యమ్మ(28), కౌతాళం మండ లం ఉప్పరహాలు గ్రామానికి చెందిన బాలుడు (16) సెంట్రింగ్‌ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరిద్దరూ అనంతపురంలో ఓ చోట పనిలో కలిశారు. వారికి ఎవరిలో ఏ అంశం నచ్చిందో ఏమో తెలియదు కానీ వయస్సును పక్కనబెట్టి ఒకరినొకరు ఇష్టపడ్డారు. అబ్బాయి కంటే అమ్మాయి వయస్సు దాదాపు 12 ఏళ్లు ఎక్కువ.

కొన్నా ళ్లు ప్రేమించుకుని, పెద్దల అంగీకారంతో గత నెల 27న వరుడి స్వగృహంలో ఘనంగా వివాహం చేసుకున్నారు. పెళ్లి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం.. పత్రి కల్లోనూ ప్రచురితం కావడంతో అధికారులు స్పందించారు. గ్రామానికి వెళ్లి వారి కోసం ఆరా తీశారు. వారు ఊళ్లో లేకపోవడంతో కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఇక సోమవారం వధూవరులను, వారి తల్లిదండ్రులకు  కలెక్టర్‌ ఎస్‌. సత్యనారాయణ, జేసీ–2 రామస్వామి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఆరేళ్ల వరకు ఎవరింటి వద్ద వారు ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి నెలా జరిగే రెవెన్యూ కోర్టులో తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ పీడీ జుబేదాబేగం, ఐసీపీఎస్‌ అధికారి శారద, ఐసీడీఎస్‌ ఏపీడీ విజయ హాజరయ్యారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top