టీడీపీ నాయకుల మెప్పు కోసం పోలీసుల కర్కశత్వం
సామాజిక మాధ్యమాల్లో వైరల్
తాడేపల్లి రూరల్: టీడీపీ నాయకుల స్వార్థ ప్రయోజనాలకు కొమ్ముకాస్తూ గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు మైనర్ బాలుడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా.. పక్కదారి పట్టించేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. తాడేపల్లిలోని ప్రకాష్నగర్కు చెందిన 14 ఏళ్ల బాలుడి తల్లిదండ్రులు గతంలో మరణించారు. దీంతో ఆ బాలుడు కూలి పనులకు వెళుతూ నాయనమ్మ, తమ్ముడిని పోషిస్తున్నాడు.
కాగా.. ఇటీవల అతడి బాబాయ్తో టీడీపీకి చెందిన వ్యక్తులు ఘర్షణకు దిగారు. ఆ ఘటనలో బాలుడి బాబాయ్ తల పగిలింది. ఆ బాలుడు 108 వాహనంలో బాబాయ్ని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నాడు. కాగా.. ఈ ఘటనపై ఆ బాలుడు కేసు పెడితే ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో నులకపేటకు చెందిన టీడీపీ మైనార్టీ నాయకుడు, ఇతర నేతలు పోలీసులపై ఒత్తిడి తెచ్చారు.
స్టేషన్కు పిలిపించి.. కర్కశత్వానికి ఒడిగట్టి..
టీడీపీ నేతల మెప్పుకోసం తాడేపల్లి పోలీసులు ఆ బాలుడిని స్టేషన్కు పిలిపించారు. కెమెరాలు లేని గదిలో అతడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి బెదిరింపులకు దిగారు. హంటర్ (చెక్కపిడికి రబ్బరు తొడిగి ఉన్న చెర్నకోలా)తో ఎస్ఐ సాయి తనను కొట్టారని, మరో కానిస్టేబుల్ తన మోకాళ్లపై బూటుకాలు వేసి తొక్కారని, అరచేతులపై దారుణంగా కొట్టారని బాలుడు మీడియా ఎదుట వాపోయాడు. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో డీఎస్పీ విచారణ చేపట్టారు. దీంతో పోలీసులు, టీడీపీ నాయకులు బాలుడి ఇంటికి వెళ్లి బెదిరించారని, బాలుడి బంధువులు, నాయనమ్మతో డీఎస్పీ ఎదుట తప్పుడు సమాధానం ఇప్పించారని సమాచారం.


