కదలిక లేని కానుక!  

Chandranna Pelli Kanuka  - Sakshi

మూడు నెలలవుతున్నాకదలిక లేని చంద్రన్న పెళ్లికానుక

పెరిగిపోతున్న దరఖాస్తులు

పరిశీలన పూర్తయినా జమకాని మొత్తం

 శ్రీకాకుళం పాతబస్టాండ్‌: నిరుపేద కుటుంబాల్లో పెళ్లి చేసుకున్న జం టలకు అండగా నిలుస్తాం అంటూ చంద్రన్న పెళ్లి కానుకకు ఆర్భాటంగా ప్రచారం చేసిన సర్కారు సకాలంలో సాయం మాత్రం అందించలేకపోతోంది. పెళ్లి చేసుకుని ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్న జంటలు జిల్లాలో పెరిగిపోతున్నాయి.

పెళ్లికానుక మాత్రం వారికి ఇంకా చేరడం లేదు. బడుగు, బలహీన వర్గాల వారు ఈ పథకంపై ఎన్నో ఆశలు పెంచుకున్నా అధికార వర్గాల్లో స్పందన కనిపించడం లేదు. 
దరఖాస్తు చేసుకున్న కొత్త జంటల ఖాతా లకు టెస్టింగ్‌ కోసమంటూ ఒక రూపాయి జమ చేయడం విస్మయాన్ని గురిచేస్తోంది.

ఒక్క రూపాయి మత్రమే జమైందని ఎవరైనా ప్రశ్నిస్తే, అకౌంటు సరిగా ఉందో లేదో చెక్‌ చేయడానికి జమ చేశామని అధికారులు చెబుతున్నారు. త్వరలో మొత్తం ఒకే సారి చెల్లిస్తామంటున్నారు.పథకం పేరు చెప్పడం, దాని గురించి రాత్రి పగలు ప్రచారం చేయడం, సమయం వచ్చే సరికి డబ్బులు ఇవ్వకపోవడం టీడీపీకి పరిపాటిగా మారిపోయింది. చంద్రన్న పెళ్లి కానుక లబ్ధిదారులకు అందని ద్రాక్షలా మారింది.

ఈ ఏడాది ఏప్రిల్‌ 20వ తేదీ నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనారిటీ, వికలాంగులు కులాంతర వివా హాలు చేసుకొన్న జంటలకు ఈ పథకం కింద ఆర్థి క సాయం అందించాలి. ప్రతి మండలంలోనూ డ్వాక్రా సంఘాల నుంచి వివాహమిత్రలను నియమించారు. పెళ్లి కుదిరిన 15 రోజుల ముందే చంద్రన్న పెళ్లికానుకకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

పెళ్లి రిజిస్ట్రేషన్‌ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన యాప్‌తోపాటుగా 100కు కాల్‌ చేసి వివాహ తేదీ, వివరాలు తెలియజేయాలి. జిల్లాలో కొందరు తమ వివరాలు అప్‌లోడ్‌ చేశారు. దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకు వివాహమిత్రలు వెళ్లి వివారాలు సేకరించి ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. వాటిని ప్రజా సాధికార సర్వేతో అనుసంధానం చేసి సరిపోల్చుతారు.

అయితే ఇప్పటి వరకు చాలా మందికి ఈ కానుకలు పడకపోవడంతో వారు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అధికారుల మాత్రం లబ్ధిదారులకు నగదు బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతోందని వారికి నచ్చజెప్పుతున్నారు. మూడు నెలలు కావస్తున్నా పెళ్లికానుక జమకాలే దు. ఒక్క రూపాయి మాత్రమే కొందరికి జమైం ది. దీంతో వారంతా విస్తుపోయారు.

దరఖాస్తు చేసుకొన్న వారు... 

జిల్లాలో ఈ చంద్రన్న పెళ్లికానుక పథకానికి మూడు నెలల్లో 1857 జంటలు దరఖాస్తు చేసుకున్నాయి. వాటిలో 1637 జంటలను మాత్రమే ఇప్పటి వరకు పరిశీలన పూర్తి చేసి అర్హులుగా గుర్తించారు. వీరిలో బీసీ సామాజిక వర్గానికి చెందినవి 1291 జంటలు, ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవి 234, ఎస్టీకి చెందిన వారు 06 జంటలు, ముస్లింలు 1, దివ్యాంగులు 39 జం టలు ఉన్నాయి.

కులాంతర వివాహాలు చేసుకొన్న వారు 56 జంటల నుంచి దరఖాస్తులు అందాయి. వీరిలో ఎస్సీ నుంచి ఇతర కులాల ఇంటర్‌ కులాల వివాహం చేసుకొన్న వారు 18, ఎస్టీ నుంచి ఇతర కులాల వివాహం చేసుకున్న వారు 6, బీసీల నుంచి ఇతర కులాలను వివాహం చేసుకొన్నవారు 32  జంటలు ఉన్నారు. అయితే వీటిలో ఇప్పటికీ వెరిఫికేషన్‌ కాని వారు 220 జంటలు ఉండగా, బ్యాంకు ఖాతాలు సరిపోనివి 350 జంటలు ఉన్నాయి. వీరికి ఇంకా జాప్యం అయ్యే అవకాశం ఉంది.

చంద్రన్న పెళ్లికానుక ఇలా (కులాలవారీగా)

  •  ఎస్సీ, ఎస్టీ కులాంతర వివాహం చేసుకొంటే రూ75వేలు.
  •  బీసీలు కులాంతర వివాహం చేసుకొంటే రూ.50వేలు,
  •  ఒకే సామాజిక వర్గానికి చెందిన వారైతే ఎస్సీలకు రూ.40వేలు,
  •   ఒకే సామాజిక వర్గానికి చెందిన ఎస్టీలైతే రూ.50వేలు ఇస్తారు. 
  •  విభిన్న ప్రతిభావంతులైతే ఏ కులానికి చెందిన వారైనా రూ.లక్ష వంతున అందజేస్తారు.

 151 జంటలకు మాత్రమే చెల్లింపులు

ఈ పథకం ద్వారా మూడు నెలల్లో ఇప్పటి వరకు కేవలం 151 మందికి కానుకలు చెల్లిం చారు. వాస్తవానికి పెళ్లిరోజునే వారి బ్యాంకు ఖాతాల్లో ఈ నగదు జమకావాల్సింది. అయితే ప్రకటనకు, అమలుకి మధ్య సంబంధం లేకుండా పోతోంది. వివిధ కేటగీరీలకు చెందిన 151 జంటలకు గాను ఇప్పటివరకు  చెల్లించా రు. అయితే మిగిలిన 1486 జంటలకు నగదు చెల్లించలేదు. వీరికి ఇంకా సుమారుగా రూ. ఏడు కోట్లు వరకు చెల్లించాల్సింది.

 ఇలా చేస్తామన్నారు..

పెళ్లికానుకకు దరఖాస్తు చేసుకున్న వారికి మంజూరు చేయాల్సిన మొత్తంలో 20 శాతం పెళ్లి నిశ్చయం అయిన రోజున, మిగిలిన 80 శాతం పెళ్లి రోజున కుమార్తె ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే ఆ మాటలు కార్యరూపం దాల్చడం లేదు.

ఆందోళన అనవసరం

పెళ్లికానుక నగదు మొత్తం జమవుతుంది. ఇప్పటికే సుమారుగా 151 జంటలకు చెల్లించాం, పంచాయతీ కార్యదర్శులు పెళ్లి ధ్రువీకరణ పత్రాలు ఆన్‌లైన్‌లో పెట్టడం ఆలస్యం అయినందు వల్ల జాప్యం జరుగుతోంది. కొన్ని బ్యాంకు ఖాతాలు ఇన్‌యాక్టివ్‌లో ఉన్నాయి. వీటిని సరిచేయాలని సూచించాం. టెస్టింగ్‌లో వివరాలు తీసుకొని, వారందరికీ నగదు జమ చేస్తాం. – జీసీ కిషోర్‌ కుమార్, డీఆర్‌డీఏ పీడీ  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top