అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు | Sakshi
Sakshi News home page

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

Published Mon, Nov 24 2014 3:10 AM

Catering for cultural events

పుట్టపర్తి టౌన్ : సత్యసాయి జయంతి వేడుకలను పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం ప్రశాంతినిలయంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా అలరించాయి. సాయంత్రం విద్యార్థుల వేదమంత్రోచ్ఛారణతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆనవాయితీలో భాగంగా సత్యసాయి జోలోత్సవం నిర్వహించారు. సత్యసాయి చిత్రపటాన్ని జోలలో ఉంచి ఊపుతూ భక్తి గీతాలాపన చేశారు.

కర్ణాటక సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ బృందం సంగీత కచేరీ నిర్వహించింది. మధుర స్వరాలొలికిస్తూ  భక్తులను అలరించింది. మంగళహారతితో జయంతి వేడుకలు ముగిశాయి. ఈ సందర్భంగా ప్రశాంతి నిలయంలో ‘నారాయణ సేవ’  నిర్వహించారు. వేలాది మందికి అన్నప్రసాదాలు పంపిణీ చేశారు.

ఓంశాంతి సంస్థ ఆధ్వర్యంలో పుట్టపర్తిలో ప్రపంచ శాంతి సద్భావన యాత్ర నిర్వహించారు. ఈ యాత్రను స్థానిక శివాలయం వద్ద రాష్ట్ర ఉపముఖ్య మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రారంభించారు. 108 శివలింగాకృతులను పుట్టపర్తిలో ఊరేగించారు. నవధాన్య, నవరత్న నిర్మిత శివలింగాలను సైతం ఊరేగించారు.

Advertisement
Advertisement