అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగేలా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఎస్పీ జె.ప్రభాకరరావు పోలీస్ అధికారులకు సూచించారు.
కోనేరుసెంటర్ (మచిలీపట్నం), న్యూస్లైన్ : అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగేలా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఎస్పీ జె.ప్రభాకరరావు పోలీస్ అధికారులకు సూచించారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆదివారం ఎస్పీ తన కార్యాలయంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలతో నేరసమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన ఉప ఎన్నికకు జరుగుతున్న భద్రతా ఏర్పాట్లపై సమీక్షించి, అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. అలాగే పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను తెలుసుకున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని చెప్పారు. కేసుల దర్యాప్తుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలన్నారు.
నేరస్తులను పసిగట్టే సందర్భాల్లో తలెత్తే సమస్యలను జిల్లా పోలీసు అధికారులు సమన్వయంతో పరిష్కరించు కోవాలని సూచించారు. జిల్లాలోని తీరప్రాంతాల వెంబడి కొట్టుకొచ్చే మృతదేహాలను గుర్తించడానికి ఫోరెన్సిక్ ల్యాబ్ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ డాక్టర్ షెముశీ బాజ్పాయి, బందరు డీఎస్పీ కె.వి.శ్రీనివాసరావు, గుడివాడ డీఎస్పీ డి.మురళీధర్, నందిగామ డీఎస్పీ డీసీహెచ్ హుస్సేన్, నూజివీడు డీఎస్పీ ఎ.శంకర్రెడ్డి, అవనిగడ్డ డీఎస్పీ కె.హరిరాజేంద్రబాబు, సీఐలు పాల్గొన్నారు.
20, 21 తేదీల్లో స్కూళ్లకు సెలవు
మచిలీపట్నం : ఉప ఎన్నికను పురస్కరించుకుని అవనిగడ్డ నియోజకవర్గంలోని పాఠశాలలకు ఈ నెల 20, 21 తేదీల్లో సెలవు మంజూరు చేసినట్లు కలెక్టర్ బుద్దప్రకాష్ ఎం.జ్యోతి ఆదివారం తెలిపారు. పోలింగ్ జరిగే 21న షాపుల్లో పనిచేసే కార్మికులకు కూడా సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు జరిగే 24వ తేదీన హిందూ కళాశాలకు, పాఠశాలకు సెలవు ప్రకటించినట్లు తెలియజేశారు.