సాక్షి, కృష్ణా జిల్లా: కృష్ణా డెల్టాకు సాగునీరివ్వాలని కోరుతూ అవనిగడ్డలో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు నిరాహార దీక్షకు దిగారు. కృష్ణా డెల్టాకు సాగునీరు ఇవ్వలేమని.. చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయంతో కృష్ణా డెల్టా రైతాంగం ఆందోళనకు దిగారు. రైతుల తరఫున సింహాద్రి రమేష్ దీక్ష చేపట్టారు. పులిచింతల, పట్టిసీమల నుంచి నీరు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నిరాహారదీక్షకు పెనమలూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జి దేవభక్తుని చక్రవర్తి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ.. ‘‘ఏరువాక చేసి కొబ్బరికాయలు కొట్టి హడావుడి చేశారు. నాట్లు వేసి, వెదలు జల్లాక నీరు లేవని చెబుతున్నారు. వరి పంట వేయొద్దని చెబుతున్నారు. కృష్ణా డెల్టాలో వరి తప్ప మరో పంటకు ఆస్కారమే లేదు. పులిచింతల, పట్టిసీమ నుంచి నీరు తీసుకుని కృష్ణాడెల్టాకు ఇస్తే సాగుకు ఇబ్బంది లేదు. 2003లో కృష్ణానదిలో పదివేల మందితో నిరసన చేపట్టాం. వర్షాకాలం మొదట్లోనే నీరు ఇవ్వలేమంటున్నారు. వ్యవసాయాన్ని చంపేయాలనే చంద్రబాబు ఇలా చేస్తున్నారు’’ అంటూ ఆయన మండిపడ్డారు.
‘‘ప్రకాశం బ్యారేజ్ దిగువున రిజర్వాయర్లు కట్టాలి. గత ప్రభుత్వంలో మట్టి నమూనాలు కూడా సేకరించాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం రిజర్వాయర్లు కట్టాలి. కృష్ణా డెల్టాకు సాగునీరివ్వాలి. సాగునీరివ్వకపోతే రైతుల తరపున ఉద్యమిస్తాం. ప్రభుత్వం స్పందించకపోతే అవనిగడ్డ నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకూ పాదయాత్ర చేపడతాం’’ అని సింహాద్రి రమేష్ బాబు పేర్కొన్నారు.
రైతులంటే చంద్రబాబుకు పడదు: దేవభక్తుని చక్రవర్తి
దేవభక్తుని చక్రవర్తి మాట్లాడుతూ.. ‘‘రైతులంటే చంద్రబాబుకు పడదు. రైతులను ఇబ్బంది పెట్టి వ్యవసాయాన్ని నాశనం చేయాలని చూడొద్దు. నాట్లు వేయకముందే నీరు ఇవ్వలేమని ఎందుకు చెప్పలేకపోయారు?. ఇప్పుడు నీరివ్వలేం వరివేయొద్దని చెబుతున్నారు. ఎల్నినో గురించి ముందు మీకు తెలియదా?. పెట్టుబడి పెట్టి నాట్లు వేశాక ఇప్పుడు నీళ్లివ్వలేమని చెబుతున్నారు. విత్తనాలు ఇచ్చే ముందు నీరు ఇవ్వలేమని మీకు తెలియదా?. నాట్లు వేసినప్పుడు ఎందుకు చెప్పలేదు?
..కుంటిసాకులు చెప్పడం మానుకుని రైతులకు నీరివ్వండి. రైతులు రోడ్డెక్కే పరిస్థితి తెచ్చుకోవద్దు. కృష్ణాడెల్టా రైతులు కన్నీరు పెడుతున్నారు. యూరియా వాడితో క్యాన్సర్ వస్తుందని చంద్రబాబు చెబుతున్నారు. క్యాన్సర్ వస్తుందని చెప్పి ఓటిపిలు పెట్టి మరీ యూరియా ఇచ్చారు. రైతులకు నీరివ్వని పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. రైతులను కన్నీరు పెట్టిస్తే ఏ ప్రభుత్వం బాగుపడదు’’ అని దేవభక్తుని చక్రవర్తి పేర్కొన్నారు.


