అనంతపురంలో బుల్లెట్ల తయారీ పరిశ్రమ | Bullets making industry in Ananthapur | Sakshi
Sakshi News home page

అనంతపురంలో బుల్లెట్ల తయారీ పరిశ్రమ

Feb 10 2020 2:16 AM | Updated on Feb 10 2020 2:38 AM

Bullets making industry in Ananthapur - Sakshi

సాక్షి, అమరావతి:  రక్షణ రంగంలో వినియోగించే బుల్లెట్ల (తూటాలు) తయారీ కేంద్రాన్ని స్టంప్‌ షూలీ అండ్‌ సోమప్ప స్ప్రింగ్స్‌ (ఎస్‌ఎస్‌ఎస్‌ స్ప్రింగ్స్‌) సంస్థ రాష్ట్రంలో ఏర్పాటుచేయనుంది. రూ.580 కోట్లతో అనంతపురం జిల్లాలో ఈ యూనిట్‌ను ఆ సంస్థ ఏర్పాటుచేయనున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి  గౌతమ్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. లక్నోలో జరిగిన డిఫెన్స్‌ ఎక్స్‌పో సందర్భంగా ఎస్‌ఎస్‌ఎస్‌ కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపామని.. మూడు నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

ప్రకాశం జిల్లా దొనకొండలో ఏర్పాటుచేయనున్న డిఫెన్స్, ఏరోస్పేస్‌ క్లస్టర్‌పై విదేశీ కంపెనీలు ఆసక్తి చూపినట్లు ఆయన తెలిపారు. బోయింగ్, ఎయిర్‌బస్, బీఏఈ సిస్టమ్స్, జాకబ్స్, లాక్‌హీద్‌ మార్టిన్‌ వంటి సంస్థలు రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలపై ఆసక్తి వ్యక్తంచేసినట్లు మేకపాటి తెలిపారు. టాటా ఏరోస్పేస్‌ సంస్థ కూడా రాష్ట్రంలో పెట్టుబడులపై ఆసక్తి కనబరిచిందని, త్వరలోనే సీఎం సమక్షంలో మరోమారు చర్చలు జరపనున్నట్లు తెలిపారు. 

స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు ఎన్‌ఎస్‌డీసీ 
సహకారం: మరోవైపు.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు పూర్తి సహకారం అందించడానికి కేంద్రం అంగీకారం తెలిపింది. న్యూఢిల్లీలో నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎస్‌డీసీ) ఎండీ, సీఈఓ డాక్టర్‌ మనీష్‌కుమార్‌ ఈ మేరకు హామీ ఇచ్చినట్లు మంత్రి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. స్థానిక యువతకు ఉపాధి అందించే లక్ష్యంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమంపై విదేశీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని.. రెనాల్ట్‌ ఇండియాతో పాటు, సీమెన్స్‌ వంటి సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి అంగీకరించినట్లు ఆయన తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement