పుట్టపర్తి మండలం బత్తలపల్లి తండాకు చెందిన గౌరీ బాయి ఐదవ కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి.. తనువు చాలించింది. పిల్లలు (ఇద్దరు మగ, ఒక ఆడ) ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు చెప్పారు.
పుట్టపర్తి అర్బన్ : పుట్టపర్తి మండలం బత్తలపల్లి తండాకు చెందిన గౌరీ బాయి ఐదవ కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి.. తనువు చాలించింది. పిల్లలు (ఇద్దరు మగ, ఒక ఆడ) ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. కొడుకు కావాలనే కోరికతోనే ఆమె ఐదవ కాన్పు వరకు వేచి చూసింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. బత్తలపల్లితండాకు చెందిన డ్రైవర్ రమేష్నాయక్కు కర్ణాటక రాష్ర్టం గౌరీబిదనూరు తాలూకా ఎల్లోడు పంచాయతీలోని శెట్టికుంట తండాకు చెందిన గౌరీబాయి (30)తో పదేళ్ల క్రితం వివాహమైంది. ఈమెకు నాలుగు కాన్పుల్లో ఆడ పిల్లలు పుట్టారు.
వీరిలో ఇద్దరు మృతి చెందగా, సారిక(7), సాత్విక (5) ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. కొడుకు కావాలన్న కోరికతో ఆమె కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోలేదు. ఈ క్రమంలో ఐదవసారి గర్భం దాల్చింది. ఐదు రోజుల కిందట పురిటినొప్పులు రావడంతో బాగేపల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో బెంగళూరులోని వాణివిలాస్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ స్కానింగ్ తీయించగా ముగ్గురు బిడ్డలు ఉన్నట్లు తేలింది. శుక్రవారం ఉదయం సిజేరియన్ ద్వారా ముగ్గురు పిల్లలను బయటకు తీశారు.
కాసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన గౌరీబాయి.. పిల్లలను తనివితీరా చూసుకుని, వారికి ముర్రుపాలు పట్టించింది. సాయంత్రం ఆమె అస్వస్థతకు గురై మృతి చెందింది. శనివారం బత్తలపల్లి తండాలో ఆమెకు అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు.


